
వైభవంగా అష్టోత్తర కలశాభిషేకం
వల్లూరు : పుష్పగిరి శ్రీ కామాక్షీ వైద్యనాఽఽథేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి ఆలయంలో అష్టోత్తర కలశాభిషేకాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఉదయం స్వామి వారికి విశ్వక్సేన పూజ , పంచామృతాభిషేకం కార్యక్రమాలను జరిపారు. వివిధ రకాల పరిహారాల కోసం బింబశుద్ధితో 108 కలశాలను ఏర్పాటు చేసి దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ నదులలోని పుణ్య జలాలు, విశేష ద్రవ్యాలతో నింపి 108 మంది దేవతలను ఆవాహన చేశారు. అనంతరం కలశాలలోని ద్రవ్యాలతో శ్రీదేవి, భూదేవి సమేత చెన్న కేశవ స్వామి ఉత్సవ మూర్తులకు అభిషేకం నిర్వహించారు. రాత్రి శ్రీ చెన్న కేశవ స్వామి యాళీ వాహనంపై కొలువు దీరగా మంగళ వాయిద్యాల నడుమ దివిటీల వెలుగులో గ్రామోత్సవాన్ని నిర్వహించారు.
● శ్రీ వైద్యనాథేశ్వర స్వామి ఆలయంలో ఆలయ అర్చకులు శ్రీనివాస మూర్తి ఆధ్వర్యంలో స్వామివారికి రుద్రాభిషేకం, శ్రీ చక్ర సహిత కామాక్షీ దేవి అమ్మవారికి కుంకుమార్చనలను నిర్వహించారు. రాత్రి శ్రీకామాక్షీ వైద్యనాథేశ్వర స్వామిని పురుషాన్ మృగ వాహనంపై కొలువుదీర్చి గ్రామోత్సవాన్ని నిర్వహించారు.
పుష్పగిరిలో నేడు చందనోత్సవం
బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి ఆలయంలో సుప్రభాత సేవ అనంతరం స్వామి వారికి చందనోత్సవం అత్యంత ఘనంగా జరుగుతుంది. రాత్రి స్వామి వారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. కామాక్షీ వైద్యనాథ స్వామి ఆలయంలో ఉదయం స్వామి వారికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు ఉంటాయి. రాత్రి మయూర వాహన సేవ జరుగుతుంది.

వైభవంగా అష్టోత్తర కలశాభిషేకం