వైవీయూ : కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాల (ఆర్ట్స్ కళాశాల) వ్యవస్థాపక దినోత్సవం శుక్రవారం వేడుకగా నిర్వహించారు. తొలుత కళాశాలకు 1952 జూన్ 14వ తేదీన అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి సర్ సీవీ రాజగోపాలచారి చేతుల మీదుగా ఏర్పాటు చేసిన శిలాఫలకానికి, 1955లో మద్రాసు వీసీ లక్ష్మణస్వామి ముదలియార్ చేతుల మీదుగా కళాశాల ప్రారంభించిన శిలాఫలకానికి పూలమాల వేసి స్మరించుకున్నారు. అనంతరం కళాశాల ఆడిటోరియంలో కళాశాల ఏర్పాటై 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్లాటినం జూబ్లీ వేడుకల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల విద్య విశ్రాంత అడిషనల్ డైరెక్టర్ పి. వీరభద్రారెడ్డి, విశ్రాంత ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఏఆర్ఎం రెడ్డిలు అతిథులుగా విచ్చేసి మాట్లాడారు. తమలాంటి వారెందరికో కళాశాల ఉజ్వల భవిష్యత్తును ఇచ్చిందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.రవీంద్రనాథ్ మాట్లాడుతూ ప్లాటినం జూబ్లీ వేడుకలను సెప్టెంబర్ 14, 15, 16 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం ఆర్ట్స్ కళాశాలలోనే చదివి, అదే కళాశాలలో అధ్యాపకులుగా పని చేసి పదవీ విరమణ చేసిన ఎంసీ వెంకటసుబ్బయ్య, కె.రఘునాథరెడ్డి, వై.చెన్నారెడ్డి, గోవిందరెడ్డి, సీహెచ్ వెంకటేశ్వరరావు, ఎస్ఎం బాషా, బీసీ సరస్వతి, వెంకటసుబ్బయ్య, జయప్రకాష్లను పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఎం. రమేష్, ప్లాటినం జూబ్లీ ఉత్సవాల ప్రోగ్రాం కోఆర్డినేటర్ పి.రాజశేఖరరెడ్డి, కళాశాల అభివృద్ధి కమిటీ కార్యదర్శి లయన్ కె.చిన్నపరెడ్డి, పోతుల వెంకట్రామిరెడ్డి, జనార్ధన్, పూర్వ విద్యార్థుల సంఘం కార్యదర్శి శివరాం, విశ్రాంత క్రీడా పాఠశాల స్పెషలాఫీసర్ డాక్టర్ ఎం.రామచంద్రారెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment