పెద్దవూర: మండలంలోని ఏనేమీదిగూడెం ప్రభుత్వ పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తూడి వెంకట్రెడ్డికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. విద్యారంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును పొందుతూ ఉపాధ్యాయ లోకానికి ఆదర్శంగా నిలుస్తున్నారు వెంకట్రెడ్డి. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రీసోర్స్ పర్సన్గా, పాఠ్య పుస్తకాలు, కరదీపికల రూపకల్పన, వినూత్న బోధన నైపుణ్యాలు, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పొందిన అవార్డుల ఆధారంగా తూడి వెంకట్రెడ్డిని ఏప్రిల్ నెల 18 నుంచి 26వ తేదీ వరకు ఫిన్లాండ్ దేశ పర్యటనకు ఎంపిక చేశారు.
ఆలేరురూరల్ : వృత్తి పట్ల అంకితభావం, సేవాదృక్పథంతో పనిచేస్తూ విద్యార్థులు ఆంగ్లభాషలో మంచి నైపుణ్య సాధించేలా కృషిచేసిన ఆలేరు మండలం గొలనుకొండ ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లిష్ టీచర్ జ్యోతిర్మయి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉద్యాధ్యాయురాలుగా ఎంపికయ్యారు. విద్యార్థులకు ఫోనెటిక్స్, అక్షరాలు సౌండ్స్తో బోధన, టీఎల్ఎం, ఎచ్టీఎంఎల్ పద్ధతి, ప్లైబేసిడ్, పేంటింగ్ ద్వారా బోధన, సొంతంగా రాయడం, చదవడం ఆటాపాటలతో విద్యాబోధన అందించారు. 2001 సంవత్సరంలో రాజాపేట మండలం రేణుకుంట ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయులిగా చేరిన ఆమె అక్కడే 10 సంవత్సరాలు పనిచేశారు. అనంతరం చిన్నకందుకూరు, పటేల్గూడెం నుంచి గొలనుకొండ ప్రాథమిక పాఠశాలలో 2014 సంవత్సరం నుంచి పనిచేస్తున్నారు. తనకు వచ్చే జీతంలో ప్రతినెలా విద్యార్థుల అవసరాలకు, విద్యాబోధనలకు ఖర్చు చేస్తూ వస్తున్నారు. పని చేసిన ప్రతి పాఠశాలలో ఇంగ్లిష్ భాషపై విద్యార్థులు పట్టు సాధించేలా బోధన అందించారు. క్రమశిక్షణ సమయపాలన పాటిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతుండడం వల్లే తనకు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు వరించిందని జ్యోతిర్మయి పేర్కొన్నారు.


