రామన్నపేట: రైతులు ఏ భూమిలో ఏ పంట సాగు చేస్తున్నారో అత్యంత కచ్చితత్వంతో నమోదు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా డిజిటల్ క్రాప్ సర్వేకు జిల్లాలో మంగళవారం శ్రీకారం చుట్టాయి. జియోఫెన్సింగ్, శాటిలైట్ సాంకేతికత ఆధారంగా ఈ సర్వే ప్రక్రియ కొనసాగుతోంది. సర్వే సిబ్బంది పొలం హద్దుల వద్దకు వెళ్తేనే డిజిటల్ క్రాప్ సర్వే యాప్ పనిచేస్తుంది.
సర్వే ఉద్దేశం ఏమిటంటే..
దేశవ్యాప్తంగా ఏ ఏ ప్రాంతాల్లో ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉందో ముందే అంచనా వేయడం సులభమవుతుంది. దిగుబడులకు తగినట్లుగా ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం, మద్దతు ధర నిర్ణయించడానికి అవకాశం కలుగుతుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతులకు జరిగిన పంట నష్టాన్ని పక్కాగా నిర్ధారించడానికి వీలవుతుంది.
ప్రతి సబ్డివిజన్ ఫొటో నమోదు తప్పనిసరి
పంటల నమోదు కోసం ప్రత్యేకంగా డిజిటల్ క్రాప్ సర్వే యాప్ను అందుబాటులోకి తెచ్చారు. ఎంపిక చేసిన సర్వేయర్లు (వలంటీర్లు) తమ స్మార్ట్ఫోన్లలో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని, తమకు కేటాయించిన సర్వే నంబర్ల (పంటచేల) వద్దకు వెళ్లి ఫొటో తీసి అప్లోడ్ చేస్తారు. గతానికి భిన్నంగా ఈసారి ఒకే సర్వే నంబర్లోని సబ్డివిజన్ల (ఫామ్ ఫీల్డ్స్) వారీగా పంటచేల ఫొటోలు తీయాల్సి ఉంటుంది. ఇలా అప్లోడ్ చేసిన డేటాను వ్యవసాయ విస్తరణ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఫైనల్ చేస్తారు. ప్రతి ఫొటో నమోదుకు ప్రభుత్వం సర్వేయర్కు రూ. 7 చొప్పున చెల్లిస్తుంది. మ్యాప్ లేని భూములు, ఎన్డీఎస్ ఖాతాల వివరాలను కూడా నేరుగా నమోదు చేస్తున్నారు.
అలసత్వం వహిస్తే రైతులకు నష్టం
డిజిటల్ క్రాప్ సర్వేలో పంట వివరాలను నమోదు చేయించడంలో రైతులు అలసత్వం వహిస్తే భవిష్యత్తులో నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలన్నా లేదా సీసీఐ ద్వారా పత్తిని సేకరించాలన్నా ఈ సర్వే వివరాలే ప్రామాణికం కానున్నాయి. కాబట్టి రైతులు సర్వేయర్లకు సహకరించి తమ పంట వివరాలు యాప్లో నమోదయ్యేలా చూసుకోవాలి.
ఫ ఆధునిక సాంకేతికతతో పంటల నమోదు
ఫ ఉపగ్రహ చిత్రాలు, జియోఫెన్సింగ్ ఆధారంగా క్షేత్రస్థాయిలో సర్వే
ఫ సర్వే నంబర్ల సబ్డివిజన్ల వారీగా ఫొటో తీస్తేనే యాప్లో అప్లోడ్
ఫ వలంటీర్లు అప్లోడ్ చేసే
ప్రతి ఫొటోకు రూ.7 చెల్లింపు
ఫ సర్వేలో వివరాలు నమోదు కాకపోతే రైతులకు ఇబ్బందులు


