చిట్యాల : రాఖీ పండుగ వేళ నల్లగొండ జిల్లా చిట్యాలలోని పీజేఆర్ రాఖీ కేంద్రం రాఖీల తయారీ, విక్రయాలతో కళకళలాడుతోంది. వినూత్న డిజైన్లు, వివిధ రకాల మోడళ్లతో కూడిన రాఖీలు కొనుగోలుదారులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సామాన్యులకు అందుబాటులో ఉండే ధరల్లో ఇక్కడ రాఖీలు లభిస్తుండటంతో.. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దుకాణాదారులు, హోల్సేల్, రిటైల్ రాఖీ విక్రయ వ్యాపారులు పెద్దసంఖ్యలో తరలివచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ కొనుగోళ్లు ఆన్లైన్ ద్వారా కూడా జరుగుతుండటం విశేషం.
గత నాలుగేళ్లుగా రాఖీలు తయారీ..
చిట్యాల పట్టణానికి చెందిన ప్రొద్దుటూరి శ్రీనివాసులు స్థానికంగా ఓ ఇంట్లో నాలుగేళ్ల క్రితం పీజేఆర్ రాఖీ తయారీ, విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ తయారీ కేంద్రం ద్వారా సుమారు 120 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. వీరిలో కొందరు అక్కడే రాఖీలు తయారు చేస్తుండగా.. చాలా వరకు రాఖీల తయారీకి అవసరమైన మెటీరియల్ను కేంద్రం నుంచి ఇంటికి తీసుకెళ్లి, రాఖీలు తయారుచేసి తిరిగి అప్పగిస్తుంటారు. ఇలా వీరు రోజువారీగా రూ.300 నుంచి రూ.500 వరకు ఇంటి వద్దే ఉంటూ సంపాదిస్తున్నారు. ప్రతి ఏటా జనవరి నుంచి రాఖీ పౌర్ణమి వరకు వారికి ఉపాధి లభిస్తోంది.
40 వేల రకాల డిజైన్లు..
ఈ పీజేఆర్ రాఖీ కేంద్రంలో 40 వేల రకాల డిజైన్ల రాఖీలు లభ్యమవుతున్నాయి. ఇందులో పిల్లలను ఆకట్టుకునే కార్టూన్ రాఖీలు, ముత్యాల రాఖీలు, జరీ, స్టోన్స్, పూసలతో పాటు పలు రకాల రంగుల దారాలతో కూడిన రాఖీలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ కేంద్రంలో 5 పైసల నుంచి అత్యధికంగా రూ.130 ధరల వరకు ఒక్కో రాఖీ లభిస్తోంది. తక్కువ ధరల్లో రాఖీలు లభ్యమవుతుండటంతో సామాన్యులతో పాటు దుకాణాదారులు తమ విక్రయ అవసరాలకు అనుగుణంగా ఇక్కడ రాఖీలు కొనుగోలు చేస్తున్నారు.
ఫ వినూత్న డిజైన్లతో ఆకట్టుకుంటున్న చిట్యాలలోని పీజేఆర్ రాఖీ
విక్రయ కేంద్రం
ఫ రాఖీలు తయారుచేస్తూ ఉపాధి
పొందుతున్న 120మంది మహిళలు
ఫ పెద్దఎత్తున తరలివస్తున్న
వ్యాపారులు


