నల్లగొండ : ఈ సంవత్సరం పత్తి కొనుగోలులో రైతులకు ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులకు సూచించారు. ఆయన మంగళవారం కలెక్టరేట్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అధికారులు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో పత్తి మద్దతు ధర, సేకరణపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సంవత్సరం ప్రభుత్వం పత్తి మద్దతు ధరను క్వింటాలుకు రూ.8,867 వరకు పెంచిందన్నారు. జిల్లాలో రెండు లక్షల 40 వేల హెక్టార్లలో రైతులు పత్తి సాగుచేశారని, సుమారు 14 లక్షల క్వింటాళ్ల పత్తి మార్కెట్కి వచ్చే అవకాశం ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. పత్తి కొనుగోలుకు జిల్లాలో 31 జిన్నింగ్ మిల్లులు ఉన్నాయని, అక్టోబర్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. పత్తిని పండించిన రైతు పత్తిని అమ్ముకునేందుకు స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలో ముందు నుంచే అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ను ఆదేశించారు. కపాస్ కిసాన్ యాప్ ద్వారా మాత్రమే పత్తి కొనుగోలుకు అవకాశం ఉందని, 8రోజుల ముందు స్లాట్ బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్న విషయాన్ని ప్రచారం చేయాలన్నారు. ప్రైవేటు జిన్నింగ్ మిల్లులు ద్వారా పత్తి కొనుగోలు చేస్తే మద్దతు ధరను మించి కొనుగోలు చేసే విధంగా చూడాలని కలెక్టర్ కోరారు.
ట్రాన్స్పోర్టు చార్జీలు ఎక్కువయ్యాయి
గత సంవత్సరం జిల్లాలోని జిన్నింగ్ మిల్లులకు కాకుండా వరంగల్, జనగామ జిన్నింగ్ మిల్లులకు ఎక్కువగా పత్తిని కేటాయించడం వల్ల జిల్లా రైతులు ట్రాన్స్పోరు్ట్ చార్జీలు ఎక్కువగా భరించాల్సి వచ్చిందని జినింగ్ మిల్లుల అధ్యక్ష, కార్యదర్శులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, ఈ సంవత్సరం ముందుగా జిల్లాలో ఉన్న జిన్నింగ్ మిల్లులకు పత్తిని కేటాయించిన తర్వాతే ఇతర జిల్లాల కేటాయించేలా ప్రభుత్వానికి ప్రతిపాదించాలని సమావేశంలో తీర్మానించారు. పత్తి అమ్మిన రైతులకు సకాలంలో చెల్లింపులు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, సిసిఐ అసిస్టెంట్ మేనేజర్ దిలీప్ అగర్వాల్, మార్కెటింగ్ అధికారి ఛాయాదేవి, పత్తి కొనుగోలు కేంద్రాల ఇన్చార్జులు, పత్తి మార్కెట్ సెక్రటరీలు పాల్గొన్నారు.
ఫ అధికారులకు కలెక్టర్ సూచన
ఫ పత్తి మద్దతు ధర, సేకరణపై సన్నాహక సమావేశం


