రైలు ఢీకొని గొర్రెల కాపరి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని గొర్రెల కాపరి దుర్మరణం

Aug 26 2026 1:30 AM | Updated on Aug 26 2026 1:30 AM

మాడుగులపల్లి, ఆత్మకూర్‌(ఎస్‌) : బతుకుదెరువు కోసం గొర్రెలను మేపేందుకు వెళ్లిన వ్యక్తి గొర్రెలను రైల్వే ట్రాక్‌ దాటిస్తున్న క్రమంలో రైలు ఢీకొని మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం మాడుగులపల్లి మండలం అబంగాపురం గ్రామంలో చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా నెమ్మికల్‌కు చెందిన బయ్య లింగయ్య, జటంగి మహేష్‌లతోపాటు వేల్పుల కొమురయ్యలు గొర్రెలను మేపేందుకుగాను మూడు నెలల క్రితం అబంగాపురం గ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం కొన్ని గొర్రెలు రైల్వే ట్రాక్‌పై వెళ్తుండగా వాటిని తరిమే క్రమంలో హైదరాబాద్‌ నుంచి గుంటూరుకు బయలుదేరిన ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ రైలు కొమురయ్య(60)ను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. మిగతా గొర్రెల కాపరులు స్టేషన్‌మాస్టర్‌కు సమాచారం అందించారు. ఆయన అక్కడికి చేరుకుని కొమురయ్య మృతదేహాన్ని మిర్యాలగూడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నల్లగొండ స్టేషన్‌ మాస్టర్‌ మనీష్‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. మృతుడికి భార్య లింగమ్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

హైవేపై వాహనాల బారులు

చౌటుప్పల్‌ : చౌటుప్పల్‌లోని హైదరాబాద్‌– విజయవాడ జాతీయ రహదారిపై మంగళవారం వాహనాలు బారులుదీరాయి. ఉదయం నుంచి సాధారణంగానే ఉన్న రద్దీ సాయంత్రం తర్వాత ఒక్కసారిగా పెరిగింది. ఇరువైపులా రద్దీ ఉన్నప్పటికీ ప్రధానంగా విజయవాడ మార్గంలో అధికంగా ఉంది. స్థానికులు రోడ్డు దాటే క్రమంలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

రేషన్‌ బియ్యం పట్టివేత

చౌటుప్పల్‌ : పట్టణ కేంద్రంలోని వలిగొండ క్రాస్‌రోడ్డు వద్ద మంగళవారం పోలీసులు 25క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్నారు. మిర్యాలగూడకు చెందిన లావుడ్యా శ్రీనివాస్‌(30), గుగులోలు అరుణ్‌(18) సమీప గ్రామాల్లో తిరిగి 25క్వింటాళ్ల బియ్యం సేకరించి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. వలిగొండ క్రాస్‌రోడ్డు వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement