డిపాజిట్ తిరిగి పొందని వారి
వివరాలు పరిశీలిస్తాం
భువనగిరి : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులకు ఇప్పటికీ డిపాజిట్ రుసుం తిరిగివ్వలేదు. గత డిసెంబర్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా సర్పంచ్, వార్డు సభ్యులుగా చాలా మంది పోటీచేసి నామినేషన్లు సమర్పించారు. సర్పంచ్లు, వార్డు సభ్యులుగా పలువురు గెలుపొందారు, మరికొందరు స్వల్ప మెజార్టీతో ఓటమి పాలయ్యారు. ఇంకొందరు డిపాజిట్లు కోల్పోయారు. గెలుపొందిన వారితో పాటు ఓటమి పాలై డిపాజిట్ దక్కించుకున్న వారిలో కొందరు ఎన్నికల ఖర్చు లెక్కలు సమర్పించకపోవడంతో అధికారులు డిపాజిట్ రుసుం తిరిగి చెల్లించనట్టు తెలుస్తోంది.
జిల్లాలో 1,567 మంది పోటీ
ఏకగ్రీవాలు పోనూ మిగతా స్థానాలకు ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ స్థానాలకు సుమారు 1,567 మంది పోటీ చేశారు. వార్డు సభ్యుల స్థానాలకు 7 వేలకుపైగా పోటీచేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మొత్తం జమైన నగదులో సగం వరకు రిఫండబుల్ కేటగిరీలోకి వస్తుంది. ఎన్నికల బరిలో నిలిచి పోలైన ఓట్లలో కనీసం ఆరో వంతు వచ్చిన వారికి మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. డిపాజిట్ కోల్పోయిన వారికి మాత్రం ఇవ్వరు. కొందరు పోటీచేసిన వారు అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం మాత్రం ఉండడం లేదు. అయితే వచ్చేవి తక్కువ డబ్బులే కధా అని వదిలేసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి గురించి అధికారులు కూడా లెక్కలు చెప్పని పరిస్థితి నెలకొంది.
ఎన్నికల ఖర్చుకు నిధులు ఇవ్వకపోవడంతో..
జిల్లాలో 2025 డిసెంబర్లో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు జరిగిన తొమ్మిది నెలలు అవుతోంది. ఫలితాల తర్వాత డిపాజిట్లు కోల్పోయిన వారిని మినహాయించుకుని మిగిన వారందరికీ డిపాజిట్ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఆ డబ్బులు అధికారుల వద్దనే ఉంచుకున్నారు. కొందరు అడిగితే మాత్రం ఎన్నికల ఖర్చులో చూపిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. సాధారణంగా ఎన్నికల సమయంలో ప్రతి మండలానికి ఎన్నికల ఖర్చు కింద రూ.5 లక్షల వరకు ప్రభుత్వం ఇవ్వాలి. వాటిని నేటికీ ఇవ్వకపోవడంతో డిపాజిట్ డబ్బులను అధికారులే వాడుకున్నట్టు తెలుస్తోంది. వాడుకున్న డబ్బులు రూ.లక్షల్లో ఉన్నట్టు సమాచారం. ఉన్నతాధికారులు స్పందించి పోటీచేసిన అభ్యర్థులకు డిపాజిట్ డబ్బులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు కోరుతున్నారు.
గ్రామ పంచాయతీలు 427
వార్డు స్థానాలు 3704
సర్పంచ్ అభ్యర్థులు 1567
వార్డు అభ్యర్థులు 700O
సర్పంచ్ డిపాజిట్ (జనరల్) రూ.2000
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు.. రూ.1000
వార్డు సభ్యులు (జనరల్) రూ.500
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు.. రూ.250
పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల డిపాజిట్ చెల్లించలేదనే విషయం మా దృష్టికి రాలేదు. డిపాజిట్ తిరిగి ఇవ్వని అభ్యర్థుల వివరాలు తెలుసుకుంటాం. ఎందుకు ఇవ్వలేదో పరిశీలన చేసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఎంపీడీఓ కార్యాలయాల్లో అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చుల లెక్కలను నిబంధనల ప్రకారం సమర్పించి, తమ ధరావతు సొమ్మును తిరిగి పొందవచ్చు.
– శ్రీనివాస్రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి
ఫ పంచాయతీ ఎన్నికల్లో డిపాజిట్ చేసిన అభ్యర్థులకు తిరిగిరాని సొమ్ము
ఫ తొమ్మిది నెలలవుతున్నా స్పందన కరువు
ఫ అడిగితే ఎన్నికల ఖర్చుల కిందచూపెడుతున్న అధికారులు


