యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవా లయంలో శుక్రవారం కణ్ణన్ తిరునక్షత్ర వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో విష్వక్సేన పూజ, పుణ్యాహ వచనం, నవకలశ స్నపనం చేసి విశేష పూజలు చేశారు. అనంతరం లక్ష్మీనరసింహ, మహాలక్ష్మి, సుదర్శన, వాసుదేవ మూలమంత్ర హవనం పూజను జరిపించారు. సాయంత్రం వేళ శ్రీస్వామిని అధిష్టించి తిరునక్షత్ర పూజలు జరిపించి, వేద పఠనం చేపట్టారు. ఈ వేడుకలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ఈఓ భవాని శంకర్, ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, ఆలయ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
యాదగిరీశుడి సేవలో ప్రముఖులు
యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామిని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి అల్పనా దూబే, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యలు తమ కుటుంబ సభ్యులతో శుక్రవారం వేర్వేరుగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి సంప్రదాయంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం ప్రముఖులకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, ఈఓ భవాని శంకర్ లడ్డూ ప్రసాదం అందజేశారు.
అల్పనా దూబేకు ఆశీర్వచనం చేస్తున్న అర్చకుడు
నవ కలశ స్నపనం నిర్వహిస్తున్న అర్చకులు


