భువనగిరిటౌన్ : ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డితో కలిసి ఆయన వివిధ ప్రాంతాల బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణికి వస్తుంటారని, అధికారులు నిర్లక్ష్యం వహించకుండా స్వీకరించిన అర్జీలను సత్వరమే డిస్పోజ్ చేయాలన్నారు. ప్రజావాణిలో మొత్తం 67 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 46, సర్వే అండ్ ల్యాండ్స్ 5, వైద్య ఆరోగ్య శాఖ 3, డీఎల్పీఓ 3, మున్సిపాలిటీకి 2 దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు. అలాగే గ్రామీణాభివృద్ధి, సంక్షేమం, పంచాయతీ, ఎస్సీ వెల్ఫేర్, సహకార, విద్యుత్, స్పెషల్ డిప్యూటీ యూనిట్, విద్యా శాఖలకు ఒక్కో దరఖాస్తు చొప్పున అందినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ జయమ్మ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ కతిక, జెడ్పీ సీఈఓ శోభారాణి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డితో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఫ అదనపు కలెక్టర్ భాస్కర్ రావు


