భువనగిరిటౌన్ : 22ఏ నిషేధిత భూములపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బీజేపీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం ఏఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 22ఏ జాబితాలో తప్పిదాలు జరిగాయని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంగీకరించిన నేపథ్యంలో జిల్లాలో అక్రమంగా చేర్చిన భూములపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. ప్రభుత్వంతో సంబంధం లేని, కోర్టు వివాదాలు లేని పట్టా భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల భూ యజమానులు అమ్మకాలు, బ్యాంక్ రుణాలు పొందలేక తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధరణి, భూభారతి పోర్టల్ రికార్డులపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలన్నారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాయ దశరథ, గూడూరు నరోత్తం రెడ్డి, చందా మహేందర్ గుప్తా, రత్నపురం బలరాం, రాళ్లబండి కష్ణచారి, ఫకీరు రాజేందర్ రెడ్డి, దయ్యాల కుమార్, చీర్క సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు


