భూదాన్ పోచంపల్లి : యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామంలోని హెజెలో లాబొరేటరీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో శుక్రవారం రాత్రి ప్రమాదవశాత్తు రియాక్టర్ పేలి పది మంది కార్మికులకు గాయాలయ్యాయి. ఇందులో ఒకరు మృతిచెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కంపెనీలో నైట్ షిఫ్ట్లో 18 మంది పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు రియాక్టర్ పేలడంతో బిహార్ రాష్ట్రంతో పాటు చౌటుప్పల్ చెందిన పది మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను కంపెనీ యాజమాన్యం అంబులెన్స్లో హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నాగిరెడ్డి అనే కార్మికుడు మృతిచెందాడు. రియాక్టర్ భారీ శబ్దంతో పేలడంతో కార్మికులకు తీవ్ర గాయాలై భయానక వాతావరణం నెలకొంది. చౌటుప్పల్ రూరల్ సీఐ సతీష్రెడ్డి, స్థానిక ఎస్ఐ జగన్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. చౌటుప్పల్లోని ఫైర్ స్టేషన్కు సమాచారం ఇచ్చి ఫైర్ఇంజన్ల ద్వారా కంపెనీలో ఎగిసిపడుతున్న మంటలను ఆర్పుతున్నారు. కాగా గాయపడిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నెల రోజుల క్రితం ఒకరు మృతి
నెల క్రితం ఇదే కంపెనీలో రియాక్టర్ శుభ్రం చేస్తుండగా ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన ఫార్మసిస్టు మృతిచెందాడు. ఇలా కంపెనీలో తరచూ ప్రమాదాలు జరుగుతుండంతో కార్మికులు, గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
పది మంది కార్మికులకు గాయాలు
ఒకరు మృతి.. మరొకరి పరిస్థితి విషమం
భూదాన్ పోచంపల్లి మండలం
దోతిగూడెం గ్రామ పరిధిలో ఘటన


