భువనగిరిటౌన్ : భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారాలకు దిగుతున్నారని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం భువనగిరిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో అధికారాన్ని అనుభవించిన నాయకులు ప్రజల సమస్యలను పట్టించుకోకుండా, ఇప్పుడు ఎన్నికలు రాగానే సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కళ్లుండి కూడా అభివృద్ధిని చూడలేకపోవడం బీఆర్ఎస్ నాయకుల రాజకీయ అంధత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు రూ.1,500 కోట్లతో రోడ్లు, తాగునీరు, సాగునీరు, కాల్వలు, బ్రిడ్జిల నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గ ప్రగతికి పెద్దపీట వేస్తున్నామని, సీఎం పాదయాత్ర సమయంలో మూసీ బ్రిడ్జి నిర్మాణానికి రూ.50 కోట్ల నిధులు మంజూరు చేయించామని గుర్తుచేశారు. బీఆర్ఎస్ హయాంలో మీరు చేసిన అభివృద్ధి ఎంత? మేము చేసిన అభివృద్ధి ఎంత? మీడియా సాక్షిగా బహిరంగ చర్చకు తాను సిద్ధమని అన్నారు. సోషల్ మీడియా దుష్ప్రచారాలతో వాస్తవాలను దాచలేరని, కాంగ్రెస్ చేసే అభివృద్ధి పనులే బీఆర్ఎస్కు అంతిమ సమాధానం చెప్తాయని తేల్చిచెప్పారు. సమావేశంలో సర్చంచ్ ఎడ్లసత్తిరెడ్డి, నాయకులు తంగళ్లపల్లి రవికుమర్, ఎడ్ల సత్తిరెడ్డి పాల్గొన్నారు.
ఫ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి


