భువనగిరి : భారత ప్రభుత్వ క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే క్రీడాపోటీల్లో పాల్గొనదలిచిన వారు మై భారత్ పోర్టల్లో పేర్లు, జట్ల వివరాలను నమోదు చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల అధికారి శ్యాంసుందర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన జిల్లాలోని యువత, విద్యార్థులు, క్రీడాకారులు ఆగస్టు నుంచి 15 వరకు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం సెల్ నంబర్ 9848666536 సంప్రదించాలని కోరారు.
సీడబ్ల్యూఎస్
స్కాలర్షిప్నకు ఎంపిక
భూదాన్పోచంపల్లి : దేశ్ముఖిలోని ఎస్సీ గురుకుల ఆర్మీ ప్రిపరేటరీ మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన ముగ్గురు ఎన్సీసీ క్యాడెట్లు పాతులోతు సోని, వేముల బిందు, ఆర్.రవళి ప్రతిష్టాత్మకమైన క్యాడెట్ వెల్ఫేర్ సొసైటీ (సీడబ్ల్యూఎస్) స్కాలర్షిప్లకు ఎంపికయ్యారని కళాశాల డైరెక్టర్ కల్నల్ రాజాదత్తా, ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీలత తెలిపారు. ఏపీ, తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లోని ఎన్సీసీ డైరెక్టరేట్ పరిధిలో మొత్తం 12 మంది క్యాడెట్లు ఎంపిక కాగా అందులో వీరు ముగ్గురు ఉన్నారన్నారు. ఏటా వీరికి రూ.6వేల స్కాలర్షిప్ లభిస్తుందని తెలిపారు. శుక్రవారం వారికి కళాశాలలో స్కాలర్షిప్ చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ప్రిన్సిపల్ కృష్ణవేణి, అసోసియేట్ ఎన్సీసీ ఆఫీసర్ లెఫ్టినెంట్ డాక్టర్ రూప, ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్ రేవతి ప్రభాకర్ ఉన్నారు.
చిన్నకొండూర్ చెరువులో ‘డెవిల్ ఫిష్’
చౌటుప్పల్ : చౌటుప్పల్ మండలం చిన్నకొండూర్ గ్రామంలోని దేపోనిచెరువులో శుక్రవారం చేపల వేటకు వెళ్లిన యువకులకు డెవిల్ ఫిష్లు లభ్యమయ్యాయి. ఇవి వింత ఆకారంలో ఉండడంతో గ్రామస్తులు వీటిని చూసేందుకు ఆసక్తి కనబరిచారు. వీటిన దయ్యం చేపలుగా పిలుస్తారని, చెరువుల్లోని చిన్న చేపపిల్లలను ఆహారంగా తీసుకుంటాయని స్థానిక మత్స్యకారులు పేర్కొంటున్నారు.
పద్మావతి అమ్మవారికి
సహస్ర కుంకుమార్చన
భువనగిరి : పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో గల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శుక్రవారం సాయంత్రం పద్మావతి అమ్మవారికి సహస్ర కుంకుమార్చన సేవ కార్యక్రమాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. అంతకు ముందు ఆలయంలో స్వామి వారికి ఉదయం సుప్రభాత సేవ, తోమాలసేవ, సహస్రనామార్చన సేవ, నిత్య కల్యాణ మహోత్సవం జరిపారు. సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ నిర్వహించారు.


