భూదాన్పోచంపల్లి: ఇక్కత్ వస్త్రాల తయారీపై అధ్యయనం చేసేందుకు హైదరాబాద్లోని యూఆర్ఎక్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీకి చెందిన 30 మంది డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థినులు శుక్రవారం పోచంపల్లిని సందర్శించారు. కళాపునర్వి హ్యాండ్లూమ్ యూనిట్, రూరల్ టూరిజం పార్కులో రంగులద్దకం, నూలు వడకడం, చిటికి కట్టడం, మగ్గాలపై తయారవుతున్న చేనేత వస్త్రాలు, డిజైన్లను పరిశీలించారు. కార్మికులతో మాట్లాడి వారికి లభిస్తున్న ఉపాధి, మార్కెటింగ్, జీవన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంస్థ సీఈఓ అర్వింద్, డైరెక్టర్ ఊర్వశీసోని మాట్లాడుతూ.. స్టడీ టూర్లో భాగంగా ఇక్కత్కు అంతర్జాతీయంగా పేర్గాంచిన పోచంపల్లికి క్షేత్ర పర్యటనకు వచ్చినట్లు తెలిపారు. సంప్రదాయ చేనేత కళ, కళాకారుల నైపుణ్యాలు, వస్త్రాల తయారీ పద్ధతులు విద్యార్థులు ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి ఈ పర్యటన ఉపయోగపడిందని పేర్కొన్నారు.


