భూదాన్పోచంపల్లి : వినూత్న ఆలోచనలే నూతన ఆవిష్కరణలకు దోహదపడతాయని 30ఎం జెనోమిక్స్ కో ఫౌండర్ డాక్టర్ బి. బెనెట్ బోస్కోదాస్ అన్నారు. సోమవారం పోచంపల్లి మండలం దేశ్ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ఎంట్రప్రెన్యూర్షిప్ సెల్(ఈ–సెల్)ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ–సెల్ వేదికలు విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు అద్భుతమైన అవకాశమన్నారు. ఎంట్రప్రెన్యూర్షిప్ అంటే కేవలం వ్యాపారం మాత్రమే కాదని, సమాజంలోని సమస్యలకు పరిష్కారం కనిపెట్టడమన్నారు. అలాగే ఈ–సెల్ విద్యార్థులకు సొంతంగా స్టార్టప్లు స్థాపించడానికి అవసరమైన నైపుణ్యాలు, ప్రోత్సహాన్ని అందించే కేంద్రంగా కూడా పనిచేస్తుందని చెప్పారు. స్టార్టప్ ప్రయాణంలో సమస్యలను ఆధిగమిస్తూ ముందుకు సాగాలని అన్నారు. అనంతరం యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ దాసేశ్వర్రావు మాట్లాడుతూ.. నూతన ఆవిష్కరణలు సమాజానికి దోహదపడేలా ఉండాలన్నారు. ఆ దిశగా విద్యార్థులు తమ ఆలోచనలకు పదును పెట్టాలని సూచించారు. అనంతరం ఈ–సెల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీలోని ఆయా విభాగాల డీన్లు, డైరెక్టర్లు, హెచ్ఓడీలు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
30ఎం జెనోమిక్స్ కో ఫౌండర్
బెనెట్ బోస్కోదాస్


