నల్లగొండ టౌన్: కర్ల రాజేష్ మృతిపై కొనసాగుతున్న విచారణలో జాప్యం జరుగుతుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఎస్పీ శరత్ చంద్ర పవార్, విచారణ అధికారి డీఎస్పీ రవిని ఆయన కలిశారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాట్లాడుతూ.. విచారణ అధికారిగా బాధ్యతలు చేపట్టి రెండు నెలలు అవుతున్నా కేసు విచారణలో ఎలాంటి పురోగతి లేదన్నారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఒత్తిడి మేరకే రీ పోస్టుమార్టం నిర్వహించారన్నారు. దాని రిపోర్టు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఈ నెల 8లోగా విచారణ పూర్తి చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారని, విచారణ ఆలస్యం చేస్తే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉద్యమం తీవ్రం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు బకరం శ్రీనివాస్, మేడి శంకర్, సునిల్, తరి ఏడుకొండలు, గోపాల్, కమలమ్మ పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు
మంద కృష్ణ మాదిగ


