చౌటుప్పల్ : పరిశ్రమల్లో సరైన భద్రతా ప్రమాణాలు పాటించాలని పరిశ్రమల శాఖ ఉమ్మడి నల్లగొండ జిల్లా డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ శ్రీదేవి సూచించారు. 55వ జాతీయ భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని వివిధ రసాయన ఽపరిశ్రమల ఆధ్వర్యంలో సోమవారం చౌటుప్పల్ మండలంలోని ధర్మోజిగూడెం క్లస్టర్ నుంచి పోచంపల్లి మండలం దోతిగూడెం క్లస్టర్ వరకు ఉద్యోగులు, కార్మికులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. అంతకు ముందు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఎలాంటి ప్రమాదాలు సంభవించొద్దంటే ముఖ్యంగా భద్రత పాటిస్తే సరిపోతుందన్నారు. చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆయా కంపెనీల యాజమాన్యాలు, ఉద్యోగులు, కార్మికులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


