గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం
నకిరేకల్ : హైదరాబాద్–విజయవాడ హైవేపై నకిరేకల్ పట్టణ పరిధిలోని పద్మానగర్ జంక్షన్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పద్మానగర్ జంక్షన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఉండగా.. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే అతడు మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని నకిరేకల్ ఏరియా ఆస్పత్రి మార్చురీలో భద్రపర్చినట్లు సీఐ హరిబాబు తెలిపారు. మృతుడి దగ్గర ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు.


