‘మధ్యాహ్నం’లో టాప్
పురస్కారం రావడం సంతోషంగా ఉంది
భువనగిరి : మధ్యాహ్న భోజన పథకం అమలులో యాదాద్రి భువనగిరి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో జిల్లా ముందు వరుసలో నిలిచినందుకు జిల్లాకు ఉత్తమ పురస్కారం లభించింది. కాగా రెండో స్థానంలో వనవర్తి జిల్లా నిలిచింది. ఈ మేరకు ఫిబ్రవరి 28న హైదరాబాద్లోని పాఠశాల విద్యా డైరెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ చేతుల మీదగా రాష్ట్రంలో రెండు జిల్లాలకు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉత్తమ పురస్కారాలను అందజేశారు. ఈ పురస్కారాని జిల్లా విద్యాశాఖ అధికారికి అందుకున్నారు. అయితే 2025–26 విద్యా సంవత్సరానికి గాను యాదాద్రి జిల్లాకు తొలి పురస్కారం లభించినందుకు యంత్రాగం హర్షం వ్యక్తం చేస్తోంది.
90 శాతానికిపైగా హాజరు
జిల్లాలో 2003 జనవరి 2వ తేదీ నుంచి 1 నుంచి 5వ తరగతి వరకు, 2008–09 సంవత్సరాల కాలంలో 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 659 పాఠశాలల్లో పథకం కొనసాగుతోంది. ఆయా పాఠశాలల్లో సుమారు 41,254 మంది విద్యార్థులు ఉండగా నిత్యం 31 వేలకు వరకు (90 శాతం మంది) విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని సద్వినియోగం చేసుకుంటున్నట్టు ఆన్లైన్ ద్వారా నమోదు చేస్తున్నారు. విద్యార్థులకు వంట చేసేందుకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,220 మంది వంట కార్మికులు పని చేస్తున్నారు.
ఈ అంశాల అమలు వల్లే పురస్కారం
2025–26 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలో మధ్యాహ్న భోజనం అమలులో ఉత్తమ పురస్కారాన్కి ఎంపిక చేసేందుకు పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇందులో మధ్యాహ్న భోజనం సద్వినియోగం చేసుకుంటున్న విద్యార్థుల హాజరు, వారానికి మూడుసార్లు గుడ్లు, రాగి జావా అందించడం, వంట కార్మికులకు, ఏజెన్సీలకు సకాలంలో బిల్లులు, వేతనాలు చెల్లించడం, తాజా కూరగాయాలు వినియోగించడం, పోషకాహారాన్ని అందించడంతోపపాటు పథకం అమలు తీరుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు.
మధ్యాహ్న భోజనం పథకం అమలులో మన జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచి ఉత్తమ పురస్కారం రావడం సంతోషంగా ఉంది. పథకాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహిస్తాం. విద్యార్థులకు నాణ్యమైన భోజనంతోపాటు పోషకాహారాన్ని అందిస్తాం.
– సత్యనారాయణ,
జిల్లా విద్యా శాఖ అధికారి
మధ్యాహ్న భోజనం పథకం అమలులో జిల్లా భేష్
ఫ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో
నిలిచిన యాదాద్రి భువనగిరి
ఫ ఉత్తమ పురస్కారాన్ని
అందుకున్న డీఈఓ


