బుద్ధవనానికి దమ్మ పాదయాత్ర
నాగార్జునసాగర్ : గౌతమ బుద్ధుడి శాంతి సందేశాన్ని ప్రజల్లో వ్యాప్తిచేస్తూ సాగిన మూడవ దమ్మ పాదయాత్ర ఆదివారం నాగార్జునసాగర్లోని బుద్ధవనానికి చేరుకుంది. 29 రోజుల పాటు సుమారు 403 కిలోమీటర్లు సాగిన ఈ పాదయాత్రకు బుద్ధవనం వద్ద ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డి, బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య.. స్థానిక నాయకులతో కలిసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ థాయిలాండ్, భారతదేశంలోని భిక్షువులతో కలిసి 403 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించి బుద్ధవనం చేరుకున్నారని తెలిపారు. పాదయాత్ర విజయవంతానికి గగన్మాలిక్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గగన్మాలిక్, అక్షయ ఫౌండేషన్ అధ్యక్షుడు కేకే రాజా, బీఎస్ఐ తెలంగాణ అధ్యక్షుడు పరంధాములు ఎంతగానో సహకరించారని తెలిపారు. 29 రోజుల పాటు సాగిన ఈ దమ్మ యాత్రలో ‘సాతి’ అనే శునకం భిక్షువులతో పాటు నడుస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మనస స్వర్ణ, బుద్ధవనం ఆర్ట్స్ మేనేజర్ శ్యాంసుందర్రావు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ రాజాప్రసాద్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అబ్బిడి కృష్ణారెడ్డి, మర్ల చంద్రారెడ్డి, సీఐ శ్రీనునాయక్, ఎస్ఐ మత్తుయ్య పాల్గొన్నారు.


