అంతర్రాష్ట్ర మోసగాళ్ల అరెస్ట్
హుజూర్నగర్ : నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్ల ద్వారా వ్యాపారస్తులను మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర మోసగాళ్లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. శనివారం సీఐ చరమందరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం తొరక్రుంటపాలెం కాలనీకి చెందిన ముత్యాల గోపీకళ్యాణ్, సిద్ధాపురం కార్తీక్ స్నేహితులు. వీరిద్దరు కలిసి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్ల ద్వారా వ్యాపారస్తులను మోసం చేస్తున్నారు. వీరు గత 10 రోజుల వ్యవధిలో హుజూర్నగర్ నియోజకవర్గంలోని మేళ్లచెరువు, మఠంపల్లి, గరిడేపల్లి, హుజూర్నగర్తో పాటు నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, త్రిపురారం ప్రాంతాల్లో వ్యాపారస్తులను మోసం చేసి రూ.2.06 లక్షల కిరాణ సరుకులు తీసుకెళ్లారు. వాటిని తక్కువ ధరకు విక్రయించి వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. శనివారం గరిడేపల్లి ఎస్ఐ తన సిబ్బందితో కలిసి పొనుగోడు ఎక్స్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా.. గోపీకళ్యాణ్, కార్తీక్ కారులో వెళ్తూ పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్ల ద్వారా మోసాలు చేస్తున్నట్లు నిజం ఒప్పుకున్నారు. వారి నుంచి రూ.1.26లక్షల నగదు, 2 సెల్ఫోన్లు, కారు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు.
ఫ రూ.1.26లక్షల నగదు, కారు,
రెండు సెల్ఫోన్లు స్వాధీనం


