శతఘటాభిషేకం.. శృంగార డోలోత్సవం
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం రాత్రి ముగిశాయి. 11 రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాలు స్వామి, అమ్మవార్ల శృంగార డోలోత్సవంతో పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా ఉదయం ఆలయంలో అర్చకులు శతఘటాభిషేకం పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో దేవాదాయ, ధర్మదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈఓ భవానీశంకర్, అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి, ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, బి. సురేంద్రాచార్యులు, అర్చకులు, పారాయణీకులు, రుత్వికులు, ఆలయాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
108 కలశాలతో..
చివరి రోజు ఆలయ ముఖ మండపంలో అర్చకులు 108 బంగారు, వెండి కలశాలను ఒకే చోటుకు చేర్చి పూజించారు. అనంతరం శుద్ధ నీరు, పంచామృతాలు, ఫల రసాలతో గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు శతఘటాభిషేకం జరిపించారు. అంతకుముందు ముఖ మండపంలో హోమం నిర్వహించి, పూర్ణాహుతి జరిపించారు. అనంతరం బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న యజ్ఞాచారులు, పారాయణీకులు, అర్చకులు, అధికారులు, సిబ్బందిని సన్మానించారు. సాయంత్రం నిత్యారాధనల అనంతరం రాత్రి స్వామివారి శృంగార డోలోత్సవం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను ఊయలలో వేంచేపు చేసి లాలి పాటలు, భక్తి గీతాలు ఆలపించారు.
నేటి నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభం
బ్రహ్మోత్సవాలు ముగియడంతో ఆదివారం నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభంకానున్నాయి. ప్రథమ ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, జోడు సేవలు, బ్రహ్మోత్సవం పూజలు తిరిగి ప్రారంభించనున్నారు.
యాదగిరీశుడి బ్రహ్మోత్సవాలకు
వైభవంగా ముగింపు పలికిన అర్చకులు
శతఘటాభిషేకం.. శృంగార డోలోత్సవం


