బౌద్ధ దమ్మయాత్రతో తెలంగాణలో శాంతి
నాగార్జునసాగర్ : ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా సిద్దార్ధ బుద్ధవిహార్ నుంచి ప్రారంభమైన దమ్మ పాదయాత్రతో తెలంగాణలో శాంతి, క్రాంతి ఆవిర్భవించనుందని హాలివుడ్ నటుడు, గగన్మాలిక్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గగన్మాలిక్ పేర్కొన్నారు. బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, మహారాష్ట్రకు చెందిన అక్షయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సిద్ధార్థ హిట్టెంబరిలతో కలిసి శనివారం నాగార్జునసాగర్లోని బుద్ధవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుమారు 403 కిలోమీటర్ల మేర సాగిన ఈ పాదయాత్ర ఆదివారం సాయంత్రం నాగార్జునసాగర్ చేరుకోనుందని తెలిపారు. పాదరక్షలు లేకుండా సుదూర ప్రయాణం చేస్తూ బౌద్ధ ధర్మ సందేశాన్ని ప్రజల్లోకి తీసుక వెళ్తున్న బౌద్ధ భిక్షువులకు ఘనస్వాగతం పలుకాలని పిలుపునిచ్చారు. థాయ్లాండ్ నుంచి తీసుకొస్తున్న బుద్ధ ధాతువులను బుద్ధవనం మహాస్థూపంలో మూడు రోజుల పాటు ప్రజల దర్శనార్ధం ఉంచనున్నట్లు తెలిపారు. మార్చి 2న శ్రీబుద్ధునితో నా ప్రయాణంశ్రీ నాటకం, 3వ తేదీన దమ్మ ధ్యానం కార్యక్రమాలు కొనసాగనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాలకు తెలంగాణ పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి వివేక్ వెంకటస్వామితో సహా ప్రజాప్రతినిధులు హాజరుకానున్నుట్లు తెలిపారు. వందమంది బౌద్ధభిక్షువులు పాల్గొంటారని చెప్పారు.
పెద్దవూరకు చేరుకున్న పాదయాత్ర..
పెద్దవూర: బౌద్ధ భిక్షువులు చేపట్టిన దమ్మయాత్ర శనివారం పెద్దవూరకు చేరుకుంది. ఈ పాదయాత్రలో కంబోడియా, వియత్నాం, థాయ్లాండ్, భారతదేశాలకు చెందిన 80 మంది బౌద్ధ భిక్షువులు పాల్గొన్నారు. గౌతమ బుద్ధుడు నడయాడిన నేల నాగార్జునకొండకు బౌద్ధ భిక్షువులు ఎంతో ప్రయాశపడి 450 కిలోమీటర్లు పాదయాత్ర చేపడుతున్నారని బీఎస్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పరంధాములు తెలిపారు.
ఫ గగన్మాలిక్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గగన్మాలిక్


