నేత్ర పర్వం.. రథోత్సవం
ఆలయంలో నేడు..
యాదగిరిగుట్ట : యాదగిరీశుడి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా దివ్య విమాన రథోత్సవం గురువారం రాత్రి నేత్ర పర్వంగా సాగింది. బుధవారం అర్ధరాత్రి లక్ష్మీదేవిని పరిణయమాడిన నృసింహుడు.. గురువారం ఉదయం ప్రధానాలయంలో నిత్యారాధనల అనంతరం శ్రీమహావిష్ణువుగా రూపుదాల్చి గరుడ వాహనంపై మాడ వీధుల్లో అమ్మవారితో కలిసి విహరించారు. అనంతరం తూర్పు రాజగోపురం ఎదుట సేవను వేంచేపు చేసి ఆలయ ప్రధానార్చకులు కాండూరి వెంకటచార్యులు అలంకార విశిష్టతను వివరించారు. ఈ వేడుకలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈఓ భవానీ శంకర్, అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి, ప్రధానార్చకులు బి. సురేంద్రాచార్యులు, అర్చకులు, పారాయణీకులు, రుత్వికులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మార్మోగిన నారసింహుడి నామస్మరణ..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో సాయంత్రం నిత్యారాధనలు పూర్తైన అనంతరం చతుస్థానార్చనలు, మండపారాధనలు, మూలమంత్ర జపములు, మండపారాధనలు, ద్వారా తోరణ పూజలు, దివ్య ప్రబంధ పారాయణాలు అర్చకులు జరిపించారు. అనంతరం దివ్య విమాన రథం ఎదుట రథాంగ హోమం, రథబలి జరిపించి స్వామి, అమ్మవార్ల అలంకార సేవను ఊరేగించారు. రాత్రి వేళ దివ్యవిమాన రథంపై ఆసీనులైన కల్యాణమూర్తులు ఆలయ మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తజనులను అనుగ్రహించారు. తిరు, మాడ వీధులు నృసింహుడి నామస్మరణతో మార్మోగాయి. స్థానికులు, వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు రథోత్సవం ముందు నృత్యాలు చేశారు. కొండపైన ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
శుక్రవారం ఉదయం 9.30గంటలకు మహా పూర్ణాహుతి, అనంతరం చక్రతీర్థం, విష్ణు పుష్కరిణిలో అవబృత స్నానం వేడుకలను అర్చకులు జరిపిస్తారు. రాత్రి 7గంటలకు శ్రీపుష్పయాగం, ద్వాదశ ఆరాధన, దేవతోద్వాసన, దోపు ఉత్సవాన్ని నిర్వహించేందుకు అర్చకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఫ ఆలయ మాడ వీధుల్లో
విహరించిన కల్యాణమూర్తులు
ఫ నేడు చక్ర తీర్థ స్నానం,
అవబృత స్నానం
నేత్ర పర్వం.. రథోత్సవం
నేత్ర పర్వం.. రథోత్సవం


