మెడికల్ షాపులోకి దూసుకెళ్లిన లారీ
నార్కట్పల్లి : లారీ అదుపుతప్పి మెడికల్ షాపులోకి దూసుకెళ్లిన ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన నార్కట్పల్లి మండల కేంద్రంలో నల్లగొండ చౌరస్తా వద్ద గురువారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రానైట్ లోడుతో నల్లగొండ నుంచి నార్కట్పల్లి మండల కేంద్రంలోకి వస్తున్న లారీ నల్లగొండ చౌరస్తా వద్ద రోడ్డు అసంపూర్తిగా ఉండటంతో అదుపుతప్పి ఎదురుగా ఉన్న మెడికల్ షాపులోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో ఫుట్పాత్పై పండ్లు కొనుగోలు చేస్తున్న మాండ్ర గ్రామానికి చెందిన మేడి కృష్ణ(38), పండ్ల వ్యాపారి గౌస్ పాషాని కూడా లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కృష్ణ, గౌస్ పాషా లారీ కింద ఇరుక్కుపోయారు. సీఐ నాగరాజు, ఎస్ విష్ణుమూర్తి, స్థానిక సర్పంచ్ భరత్ ఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ, క్రేన్ సహాయంతో లారీని బయటకు తీయిస్తుండగా.. కృష్ణ మృతిచెందాడు. పండ్ల వ్యాపారి గౌస్ పాషా స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. లారీ డ్రైవర్ క్యాబిన్లోనే ఇరుక్కుపోయాడు. ఈ ఘటనతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. అయితే ఘటనా స్థలానికి పోలీసులు ఆలస్యంగా వచ్చారని, వారు ఆలస్యంగా రావడంతోనే కొన ఊపిరితో ఉన్న మేడి కృష్ణ మృతిచెందాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.
40 రోజుల క్రితం ఇక్కడే..
40 రోజుల క్రితం ఇదే చౌరస్తాలో డీసీఎం నల్లగొండ నుంచి అతివేగంగా వస్తూ రోడ్డు క్రాస్ చేస్తుండగా ఎదురుగా ఉన్న షాపులోకి దూసుకెళ్లింది. నల్లగొండ చౌరస్తా వద్ద రోడ్డు విస్తరణ పనులు పూర్తిచేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేయడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఫ ఒకరు మృతి.. మరో ఇద్దరికి గాయాలు
ఫ నార్కట్పల్లి మండల కేంద్రంలో ఘటన
మెడికల్ షాపులోకి దూసుకెళ్లిన లారీ


