చిన్నారి మృతికి కారణమైన వారిని శిక్షించాలి
భువనగిరిటౌన్ : నాగర్కర్నూల్ జిల్లాలోని కుమ్మెర మల్లన్న జాతరలో చిన్నారి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్. వీరయ్య అన్నారు. ఈ మేరకు సీపీఎం ఆధ్వర్యంలో గురువారం భువనగిరి జిల్లా కేంద్రంలోని జగ్జీవన్రామ్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 18న కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబానికి చెందిన భార్యాభర్తలపై గ్రామ పెత్తందారులు దాడి చేయగా వారి రెండు నెలల పసిపాప మృతిచెందిందన్నారు. ఈ ఘటన జరిగి వారం గడుస్తున్నా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో బలహీన వర్గాలపై కుల దురహంకార దాడులు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదని అన్నారు. గ్రామ సర్పంచ్గా ఉన్న వ్యక్తి ఈ చర్యకు పాల్పడితే అధికార పార్టీ అండగా నిలబడటం సరికాదన్నారు. రాష్ట్రంలో కులం, మతం పేరుతో వరుస ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, ఈ ఘటనలో ప్రధాన దోషులను ఇప్పటికీ అరెస్ట్ చేయలేదని, ఇది సమాజమంతా తల దించుకునే అమానవీయ చర్య అన్నారు. కులం పేరుతో జరిగే హత్యలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేసి సక్రమంగా అమలు చేయాలన్నారు. ఈ ధర్నాలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ. జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, జల్లెల పెంటయ్య, గుంటోజు శ్రీనివాసచారి, జిల్లా కమిటీ సభ్యులు మాయ కృష్ణ, బొలగాని జయరాములు, బొల్లు యాదగిరి, అవ్వారు రామేశ్వరి, ఎండీ. పాషా, బొడ్డుపల్లి వెంకటేశం, గంగాదేవి సైదులు, ఎంఏ. ఇక్బాల్, వనం ఉపేందర్, గుండు వెంకటనర్సు, కోట రామచంద్రారెడ్డి, మధ్యపురం రాజు, బల్గూరి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
ఫ సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీరయ్య


