మృతుడి కుటుంబానికి రూ.80లక్షల పరిహారం
భూదాన్పోచంపల్లి : మండలంలోని దోతిగూడెంలోని వీజె సాయి కెమికల్ కంపెనీలో శుక్రవారం జరిగిన పేలుడు వల్ల మృతిచెందిన ధార పవన్ కుటుంబానికి రూ.80లక్షల పరిహారం చెల్లించేలా కంపెనీ యాజమాన్యం అంగీకరించింది. ఈ మేరకు శనివారం మృతుడి భార్య సౌజన్యకు ఒప్పంద పత్రాలు అందజేశారు. కాగా పరిహారం చెల్లించే విషయమై మృతుడి బంధువులు, కంపెనీ యాజమాన్యం శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు చర్చలు జరిపారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం, సర్పంచ్ యాట జంగయ్య, ఉప సర్పంచ్ బద్దం వెంకట్రెడ్డి, పలువురు గ్రామస్తులు మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని పట్టుబట్టారు. దీంతో ఎట్టకేలకు కంపెనీనీ యాజమాన్యం దిగొచ్చి మృతుడి కుటుంబానికి తక్షణం రూ.5లక్షలతో పాటు మూడు విడతల్లో నెలకు రూ.25 లక్షల చొప్పున పరిహార చెక్కులతో పాటు నెలనెలా రూ.10వేలు పీఎఫ్ చెల్లించేలా ఒప్పందం చేసుకొని పత్రాలు అందజేశారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు. కంపెనీ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చౌటుప్పల్ రూరల్ సీఐ రాములు, ఎస్ఐ భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా అర్థరాత్రే పోలీసులు పవన్ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
ఫ అంగీకరించిన వీజె సాయి
కెమికల్ కంపెనీ యాజమాన్యం


