
అడిగితే.. అదిగో ఇదిగో!
బీఎన్ తిమ్మాపూర్ నిర్వాసితులందరికీ అందని పరిహారం
బీఎన్ తిమ్మాపూర్ నిర్వాసితుల్లో కొందరికి పరిహారం పెండింగ్ ఉంది. ఇటీవల నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిని కలిసి పెండింగ్ పరిహారం విడుదల చేయాలని కోరడం జరిగింది. మంత్రి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే చెల్లిస్తాం. ఆ తరువాత రిజర్వాయర్ను గోదావరి జలాలతో నింపుతాం.
–అనిల్కుమార్రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే
బస్వాపూర్ రిజర్వాయర్లో భూములు కోల్పోయిన తమకు ఏళ్లు గడిచినా పరిహారం అందలేదు. ప్రాజెక్టులోకి నీరు విడుదల చేస్తామని అధికారులు అంటున్నారు. మేము ఎక్కడికి పోవాలి. పరిహారం చెల్లిస్తే పునరావాస గ్రామంలో ఇల్లు నిర్మించుకుని వెళ్లిపోతాం. పరిహారం ఇచ్చి ఖాళీ చేయించాలి.
–నందు, బీఎన్ తిమ్మాపూర్
బీఎన్తిమ్మాపురంలో నిర్వాసితులందరికీ పరిహారం చెల్లించలేదు. 200 మంది వరకు ఇచ్చారు. ఇంకా 350 మందికి పెండింగ్ ఉంది. అందరికీ పరి హారం డబ్బులు ఇస్తే పునరావాస గ్రామంలో ఇళ్లు నిర్మించుకుంటారు. పనులు మొదలై ఏళ్లు గడుస్తుంది. డబ్బుల కోసం గ్రామస్తులు ఎదురు చూస్తున్నారు.
–ఎడ్ల సత్తిరెడ్డి, బీఎన్ తిమ్మాపురం
సాక్షి, యాదాద్రి: నృసింహసాగర్ రిజర్వాయర్ పనులు మొదలై ఏడేళ్లు పూర్తి కావస్తోంది. కానీ, ప్రాజెక్టు నిర్మాణానికి భూములిచ్చిన రైతులు మాత్రం పరిహారం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. అధికారులను అడిగితే అదిగో,ఇదిగో అంటున్నారే తప్ప.. స్పష్టత ఇవ్వడంలేదని నిర్వాసితులు వాపో తున్నారు. రిజర్వాయర్లోకి నీటిని విడుదల చేయాలంటే బీఎన్ తిమ్మాపురం గ్రామాన్ని ఖాళీ చేయించాలి. నిర్వాసితులందరికీ పరిహారం చెల్లిస్తే తప్ప ఊరిని ఖాళీ చేయించే పరిస్థితి లేదు.
రూ.79 కోట్లు పెండింగ్..
కాళేశ్వరం ప్రాజెక్టు 16వ ప్యాకేజీలో భువనగిరి మండలం బస్వాపురం వద్ద నృసింహసాగర్ సాగర్ రిజర్వాయర్ నిర్మిస్తున్నారు.11.39 టీఎంసీలతో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం బీఎన్ తిమ్మాపూర్ గ్రామస్తులకు గ్రామకంఠం కింద రూ.109 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంది. అందులో పది నెలల క్రితం కేవలం రూ.30 కోట్లు మాత్రమే చెల్లించారు. ఇంకా రూ.79 కోట్లు పెండింగ్లో ఉంది. గ్రామంలో 550 మంది వరకు నిర్వాసితులు ఉండగా 200 మందికి పరిహారం వచ్చింది. మరో 350 మందికి పెండింగ్ ఉంది. నిర్వాసితులందరికీ పరిహారం చెల్లిస్తే ప్రస్తుతం 1.5 టీఎంసీల నీటిని రిజర్వాయర్లో నిల్వ చేయవచ్చు. కానీ, పరిహారం చెల్లింపులో జరుగుతున్న జాప్యం వల్ల రిజర్వాయర్లోకి నీటి విడుదలపై స్పష్టత ఉండటం లేదు.
ఫ 350 మందికి రూ.79 కోట్లు పెండింగ్
ఫ అందరికీ చెల్లిస్తేనే గ్రామాన్ని ఖాళీచేయించడానికి అవకాశం
ఫ నృసింహసాగర్ రిజర్వాయర్లోకి
నీటి విడుదలకు మరికొంత సమయం