
ఉక్కపోత.. చిన్నారుల వెత!
ఫ అంగన్వాడీ కేంద్రాల్లో వసతుల లేమి
ఫ చాలా చోట్ల ఫ్యాన్లు కూడా లేని దయనీయ స్థితి
ఫ ఎండతీవ్రతకు ఉక్కిరిబిక్కిరి
ఆలేరు రూరల్ : ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే తన ప్రతాపం ప్రదర్శిస్తున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరువయ్యాయి. పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వగా అంగన్వాడీ కేంద్రాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్రాల్లో సౌకర్యాలు కొరవడటంతో చిన్నారులు, బాలింతలు, గర్భిణులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చాలా కేంద్రాల్లో కనీసం ఫ్యాన్లు కూడా లేవని, ఎండవేడిమికి కేంద్రాలకు వెళ్లలేని పరిస్థితి ఉందని లబ్ధిదారులు వాపోతున్నారు. ముఖ్యంగా చిన్నారులు ఉక్కపోతకు ఉండలేకపోతున్నారు. ఎండతీవ్రత కారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలను కేంద్రాలకు పంపాలంటే జంకుతున్నారు.
జిల్లాలో 901 అంగన్వాడీ కేంద్రాలు
జిల్లాలో భువనగిరి, ఆలేరు, రామన్నపేట, మోత్కూరు ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 901 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలు కలిపి 25వేల మందికి పైనే ఉన్నారు. ఎండతీవ్రత వల్ల కేంద్రాలకు చిన్నారుల హాజరుశాతం తగ్గుతోంది. కేంద్రాలను ఒంటిపూట నిర్వహించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
ఫ్యాన్లు లేని కేంద్రాలే అధికం
ఆలేరు ప్రాజెక్టు పరిధిలో 219 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో కేవలం 56 కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలున్నాయి. 116 కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలల్లోని ఇరుకు గదులు, వరండాల్లో నిర్వహిస్తున్నారు. 47 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వీటిలో మరుగుదొడ్లు లేనివి 111, మంచినీటి సౌకర్య లేనివి 70, విద్యుత్, ఫ్యాన్ వసతి లేని కేంద్రాలు 96 వరకు ఉన్నాయి. గాలి, వెలుతురు రాకపోవడం, ఫ్యాన్లు లేకపోవడం, వానొస్తే కురువడం, బండలు పగిలిపోయి ఎలుకలు, పాములకు నిలయంగా మారుతున్నాయి. ఆరు కేంద్రాలకు నూతన భవనాలు మంజూరైనా పనులు ముందుకు సాగడం లేదు. రఘునాథపురం, మల్లాపురం, మంచిరోనిమామిళ్లు గ్రామంలో గోతులు తీసి వదిలేయగా.. టంగుటూరు, మాసాయిపేట, మోటకొండూర్లో పనులే మొదలుకాలేదు. ఒక్కో కేంద్రం నిర్మాణానికి రూ.12 లక్షలు మంజూరయ్యాయి.

ఉక్కపోత.. చిన్నారుల వెత!