డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులో ఒకరికి జైలు | - | Sakshi
Sakshi News home page

డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులో ఒకరికి జైలు

Apr 26 2025 12:59 AM | Updated on Apr 26 2025 12:59 AM

డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులో  ఒకరికి జైలు

డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులో ఒకరికి జైలు

సూర్యాపేటటౌన్‌ : మద్యం సేవించి వాహనం నడిపిన ఒకరికి సూర్యాపేట ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి బీవీ రమణ రెండు రోజుల జైలు శిక్ష విధించారు. సూర్యాపేట పట్టణ ట్రాఫిక్‌ ఎస్‌ఐ సాయిరాం తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి సూర్యాపేట పట్టణంలోని కొత్త బస్టాండ్‌ ప్రాంతంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈక్రమంలో మద్యం సేవించి డ్రైవింగ్‌ చేస్తూ ఆరుగురు పట్టుబడినట్లు తెలిపారు. వారిని శుక్రవారం కోర్టులో హాజరుపరచగా సూర్యాపేట ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి బీవీ రమణ ఒకరికి రెండు రోజుల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా, మిగతా ఐదుగురికి రూ.6వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

బైక్‌ అదుపుతప్పి ఇద్దరు

యువకుల దుర్మరణం

మునుగోడు: బైక్‌ అదుపుతప్పి విద్యుత్‌ స్తంభానికి ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన శుక్రవారం మునుగోడు మండలంలోని ఊకొండి గ్రామ శివారులో చోటుచేసుకుంది. గ్రామస్తులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మర్రి మురళి (21), బింగి మచ్చగిరి(20) ఇరువురు స్నేహితులు. మురళి హైదరాబాద్‌లోని ఓ దుకాణంలో పనిచేస్తున్నాడు. గ్రామానికి చెందిన అతడి స్నేహితుడు వివాహానికి వచ్చాడు. తిరిగి హైదరాబాద్‌కు వెళ్లాల్సి ఉండగా చిట్యాలలోని పౌల్ట్రీ ఫామ్‌లో పనిచేస్తున్న అతడి స్నేహితుడు మచ్చగిరితో కలిసి చిట్యాల వరకు బైక్‌పై వెళ్లి, అక్కడి నుంచి బస్సులో వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఈక్రమంలో ఊకొండి నుంచి ఇద్దరు కలిసి బైక్‌పై సాయంత్రం సమయంలో బయలుదేరారు. గ్రామ శివారులోని సెల్‌టవర్‌ సమీపంలోని మూలమలుపు వద్ద విద్యుత్‌స్తంభానికి బైక్‌ బలంగా ఢీ కొనడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న మునుగోడు ఎస్సై రవి సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చేతికి వచ్చిన కుమారులు అర్ధాంతరంగా మృతి చెందడంతో వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగారు.

అక్రమంగా మట్టి తరలిస్తున్న ఐదు టిప్పర్లు సీజ్‌

కోదాడరూరల్‌ : అనుమతి లేకుండా మట్టి తరలిస్తున్న ఐదు టిప్పర్లను, మట్టి తవ్వుతున్న జేసీబీని మైనింగ్‌ అధికారులు శుక్రవారం సీజ్‌ చేశారు. వివరాలిలా ఉన్నాయి. కోదాడ మండలం కూచిపూడి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 633లో అనుమతి లేకుండా మట్టి తరలిస్తున్నారనే సమాచారం మేరకు మైనింగ్‌ అధికారులు స్థానిక రెవెన్యూ అధికారులు, పోలీసు సిబ్బంది తనిఖీ నిర్వహించారు. మట్టి తవ్వుతున్న జేసీబీతో పాటు ఐదు టిప్పర్లను సీజ్‌ చేసి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అదేవిధంగా గ్రామ పరిధిలోని సర్వే నంబర్‌ 615లో జనవరి 16 నుంచి ఫిబ్రవరి 4వరకు మట్టి తవ్వేందుకు అనుమతి తీసుకొని దానిని జూన్‌ 4వరకు గడువు ఉన్నట్లుగా ఫోర్జరీ చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఈమేరకు వానికి జరిమానా విధించనున్నట్లు మైనింగ్‌ ఏడీ విజయరామరాజు, ఆర్‌ఐ జగదీష్‌ తెలిపారు.

జూదరుల అరెస్ట్‌

త్రిపురారం : త్రిపురారం గ్రామ శివారులోని పంట పొలాల్లో గుట్టుచప్పుడు కాకుండా జూదం ఆడుతున్న వారిపై శుక్రవారం త్రిపురారం పోలీసులు దాడి చేసి ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. మరో ఐదుగురు పరారయ్యారు. ఎస్‌ఐ ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ శివారులోని పొలాల్లో జూదం ఆడుతున్నట్లు సమాచారం రావడంతో ఆకస్మికంగా దాడి చేసి ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. మరో ఐదుగురు పారిపోయినట్లు పేర్కొన్నారు. వీరి నుంచి రూ.7200 నగదు, నాలుగు సెల్‌ఫోన్లు, ఆరు బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement