
పరిశీలన.. తప్పుల సవరణ
672 పాఠశాలలు ఎంపిక
జిల్లాలో 715 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా సర్వే కోసం 672 పాఠశాలలను ఎంపిక చేశారు. నల్లగొండ డైట్ విద్యార్థులతో పాటు భువనగిరిలోని మదర్ థెరిస్సా, స్టాన్ఫోర్డ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, చౌటుప్పల్లోని ఏఎంఆర్ బీఈడీ కళాశాలలకు చెందిన 63 మంది విద్యార్థులకు సర్వే బాధ్యతలు అప్పగించారు. ఒక్కొక్కరికి 10 పాఠశాలలు కేటాయించారు. రోజూ రెండు పాఠశాలల్లో సర్వే చేస్తున్నారు. వీరికి క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు సహకరిస్తున్నారు. యూడైస్లో తప్పులు ఉంటే వాటిని సవరించి తుది నివేదికను జిల్లా విద్యాశాఖ అధికారికి అందజేయనున్నారు. ఈనెల 15న మొదలైన సర్వే 21వ తేదీ వరకు కొనసాగనుంది.
భువనగిరి : పాఠశాలలకు సంబంధించి యూడైస్ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్)లో నమోదు చేసిన సమగ్ర సమాచారాన్ని విద్యాశాఖ తొలిసారిగా థర్డ్ పార్టీతో సర్వే చేయిస్తోంది. ఆన్లైన్లో పొందుపరిచిన వివరాలు పారదర్శకంగా ఉన్నాయా, లేదా.. అని థర్డ్ పార్టీ వ్యక్తులు నేరుగా పాఠశాలలకు వెళ్లి పరిశీలిస్తున్నారు. ఈ నివేదిక ఆధారంగానే పాఠశాలలకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయించనుంది.
బీఈడీ, డీఈడీ విద్యార్థులతో సర్వే
పాఠశాలల సమగ్ర సమాచారాన్ని ఉపాధ్యాయులు ఏటా యూడైస్లో నమోదు చేస్తున్నారు. ఈ సమాచారాన్ని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ధ్రువీకరించి ఎంఈఓలకు నివేదిక అందజేస్తారు. ఎంఈఓల పరిశీలన అనంతరం ఆన్లైన్లో నమోదు చేస్తారు. పాఠశాలలకు నిధుల కేటాయింపు, పథకాల అమలుకు ఈ నివేదిక ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అయితే ఆన్లైన్లో నమోదు చేసిన వివరాలకు, పాఠశాలల్లోని రికార్డులకు సరిపోలక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తప్పులను సవరించేందుకు విద్యాశా ఖ బీఈడీ, డీఈడీ విద్యార్థులతో సర్వే చేయిస్తోంది.
ఈ అంశాలపై సర్వే
పాఠశాలల్లో నమోదైన విద్యార్థులు, వారంతా అదే స్కూల్లో చదువుతున్నారా, ఉపాధ్యాయుల సంఖ్య, తరగతి గదులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, తాగునీటి వసతి, వంటగది, విద్యుత్ సౌకర్యం, ఫర్నిచర్, గ్రంథాయాలు, డిజిటల్ తరగతి గదులు, క్రీడా మై దానం, మధ్యాహ్న భోజనం, యూనిఫాం, పాఠ్యపుస్తకాలు అందాయా, క్రీడా మైదానం ఉందా, తరగతి గదులెన్ని, ఇంకా ఎన్ని అవసరం తదితర వివరాలను యూడైస్లో నమోదు చేశారు. థర్డ్ పార్టీ వ్యక్తులు స్కూళ్లకు వెళ్లి సరిపోల్చి చూస్తున్నారు.
‘యూడైస్’పై థర్డ్ పార్టీతో సర్వే
పాఠశాలలకు వెళ్లి పరిశీలిస్తున్న బీఈడీ, డీఈడీ విద్యార్థులు
నేడు విద్యాశాఖకు నివేదిక అందజేత
దీని ఆధారంగానే బడులకు బడ్జెట్
పారదర్శకత కోసమే సర్వే
పాఠశాలల్లోని సమగ్ర సమాచారాన్ని ప్రతి విద్యా సంవత్సరం యూడైస్లో నమోదు చేస్తాం. వివరాలు సరిగా ఉన్నాయా లేదా సరిపోల్చేందుకు విద్యాశాఖ తొలిసారిగా థర్డ్ పార్టీతో సర్వే చేయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బీఈడీ, డీఈడీ విద్యార్థులతో సర్వే చేయిస్తున్నాం.
– సత్యనారాయణ, జిల్లా విద్యాశాఖ అధికారి