
ట్రంప్ తీరుపై నెటిజన్ల మండిపాటు
వర్జీనియా: సైనిక అమరులకు నివాళుల సందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2021లో అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ సందర్భంగా అబే గేట్ వద్ద మరణించిన 12 మంది సైనికులకు ఆర్లింగ్టన్ నేషనల్ శ్మశానవాటికలో ట్రంప్ నివాళులరి్పంచారు. ఈ సందర్భంగా ఆయన వివాదాస్పద హావభావాలు ప్రదర్శించారు. సమాధుల వద్ద ఫొటోలకు పోజులివ్వడమే గాక చిరునవ్వులు చిందిస్తూ కన్పించారు.
అంతటితో ఆగకుండా బొటనవేలు పైకెత్తి థమ్సప్ చిహ్నం చూపారు. వీటిపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. సైనిక అమరుల పట్ల ఆయన అత్యంత అగౌరవంగా, అవమానకరంగా ప్రవర్తించారని నెటిజన్లు దుయ్యబడుతున్నారు. సమాధుల వద్ద చిరునవ్వులు చిందించడమేంటని మండిపడుతున్నారు. సమాధుల వద్ద నవ్వడం అసాధారణమని రిపబ్లికన్ నేత ఆడమ్ కిన్సింగర్ ఎక్స్లో పేర్కొన్నారు. సైనిక అమరుల కుటుంబాలకు సంఘీభావం తెలిపినందుకు ట్రంప్ను కొందరు అభినందించారు. మరికొందరేమో ఇది కూడా ప్రచార వ్యూహంలో భాగమంటూ పెదవి విరిచారు.