కొయ్యలగూడెం : కొయ్యలగూడెంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వద్ద బాలింత మృతి చెందిన ఘటనకు సంబంధించి ఆమె బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. కొయ్యలగూడెంకు చెందిన ఓ గర్భిణి జంగారెడ్డిగూడెం రోడ్డులోని ప్రైవేట్ ఆసుపత్రిలో డెలివరీ కోసం చేరారు. అయితే ఆపరేషన్ చేయగా బిడ్డ జన్మించిన అనంతరం బాలింతకు ఫిట్స్ వచ్చినట్లు తెలిసింది. దీంతో అదే ఆసుపత్రికి చెందిన అంబులెన్స్లో బాలింతను రాజమండ్రిలోని వేరొక ప్రైవేట్ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మరణించినట్లు ఆసుపత్రి యాజమాన్యం పేర్కొంది. అయితే, ఇందుకు విరుద్ధంగా బంధువులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఆసుపత్రి వైద్యుడి నిర్లక్ష్యం వల్లనే బాలింత మృతి చెందిందని, ఆపరేషన్ సమయంలోనే ఆమె చనిపోయినప్పటికీ... ఆ విషయాన్ని పక్కదారి పట్టించడానికి మృతదేహాన్ని రాజమండ్రికి తరలించి, అక్కడ చనిపోయినట్లు నమ్మబలుకుతున్నారని మృతురాలి బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. దాదాపు వంద మంది ఆసుపత్రి వద్ద ఆందోళనకు పూనుకోవడంతో పాటు ఆసుపత్రిలోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. దీంతో జాతీయ ప్రధాన రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న ఎస్సై వి. చంద్రశేఖర్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు కొనసాగించారు.


