తణుకు అర్బన్: పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనుకున్న సమయంలో మృత్యువు కబళించిన ఘటన తణుకు మండలం తేతలి జాతీయ రహదారిపై గురువారం చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా, మూడేళ్ల బాలుడితో పాటు ఆరుగురు గాయపడ్డారు. తణుకు పట్టణ శివారు వీరభద్రపురానికి చెందిన మెరిపే ప్రసాద్, ఆయన భార్య వెంకటలక్ష్మి (38), కుమారుడు హేమ చంద్రబాబుతో కలిసి తాడేపల్లిగూడెం మండలం పడాల నుంచి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయలుదేరారు. అదే సమయంలో తణుకుకు చెందిన లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు చీకటి శ్రీనివాసరావు కుటుంబసభ్యులతో కలిసి కారులో వస్తున్నారు. తేతలి జాతీయ జాతీయ రహదారి పెట్రోలు బంకుకు ఎదురుగా వచ్చేసరికి వీరి కారు అదుపుతప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి, పంట కాలువ దాటి అవతలి గట్టుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వెంకటలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె భర్త ప్రసాద్కు తీవ్రగాయాలయ్యాయి. కారులో ఉన్న శ్రీనివాసరావుకు కాలు విరగగా, మిగిలిన నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ప్రమాదం సినిమా స్టంట్ను తలపించేలా..
తేతలి జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదం సినిమా స్టంట్ను తలపించింది. కల్వర్టు వద్ద బైక్ను ఢీకొన్న కారు, సుమారు 20 అడుగుల వెడల్పు ఉన్న పంట కాలువ పైనుంచి గాల్లోకి లేచి పల్టీలు కొడుతూ అవతలి గట్టుపై పడింది. ప్రమాద సమయంలో ద్విచక్ర వాహనంపై ఉన్న మూడేళ్ల బాలుడు హేమ చంద్రబాబు ఎలాంటి గాయాలు లేకుండా బయటపడటం విశేషం. తల్లి మృతదేహం వద్ద బాలుడు రోదించిన తీరు అందరినీ కలచివేసింది.
అందుబాటులో లేని 108 వాహనం
ప్రమాద సమయంలో 108 వాహనం అందుబాటులో లేకపోవడంతో స్థానికులు క్షతగాత్రులను ట్రక్కు ఆటోలో ఆసుపత్రికి తరలించారు. తణుకుకు కేటాయించిన 108 వాహనం మరమ్మతుల్లో ఉండగా, ప్రత్యామ్నాయ వాహనం ఏలూరు వెళ్లడంతో ఈ పరిస్థితి తలెత్తింది. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులను, క్షతగాత్రులను స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పరామర్శించారు.
మహిళ మృతి, ఆరుగురికి గాయాలు


