దెందులూరు: ప్రజలంతా మోసపూరిత అప్లికేషన్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కే. శివకిషోర్ అన్నారు. పొరపాటున కూడా క్యూవీఎస్ఈ అప్లికేషన్లను ఎవ్వరూ ఓపెన్ చేయవద్దని హెచ్చరించారు. ఏ ఒక్కరూ ఉచితంగా డబ్బులు ఇవ్వరని, అత్యాశకు పోవద్దని సూచించారు. అధిక వడ్డీలు, ఎక్కువ డాలర్లు ఇస్తామని నమ్మబలికే మాటలు చెప్పడమే కాకుండా, మొదట్లో ఒకటి రెండు నెలలు నమ్మకం కోసం డబ్బులు జమ చేస్తారని, ఆ తర్వాత బోర్డు తిప్పుతారని తెలిపారు. కాబట్టి అత్యాశకు పోయి మోసపోవద్దని ఎస్పీ సూచించారు. సైబర్ మోసాలకు గురైతే బాధితులు వెంటనే సైబర్ సెల్కు ఫిర్యాదు చేయాలని వివరించారు. మరోవైపు, మోసపూరిత అప్లికేషన్లపై ప్రజలను అప్రమత్తం చేస్తున్న ఎస్పీ సందేశాన్ని దెందులూరు ఎస్సై డి. వెంకట్కుమార్.. వాట్సప్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
తాడేపల్లిగూడెం (టీఓసీ): పట్టణంలో గురువారం తెల్లవారుజామున టూటౌన్ నుంచి వన్టౌన్ వైపునకు మొదటి ఫ్లైఓవర్ బ్రిడ్జి మార్గంలో ఓ ట్రాలీపై వెళుతున్న క్రేన్ అదుపు తప్పి పడిపోయింది. క్రేన్లోని ఆయిల్ అంతా ఒలిగింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. అనంతరం క్రేన్ను అక్కడ నుంచి తొలగించి వేరే ప్రాంతానికి తరలించారు.
కొయ్యలగూడెం: అక్రమ కలపను స్వాధీనం చేసుకున్నట్లు కన్నాపురం అటవీ శాఖ రేంజర్ సెహన్షా గురువారం పేర్కొన్నారు. కొయ్యలగూడెం– గవరవరం మెయిన్ రోడ్డు సమీపంలో ట్రాక్టర్ ట్రక్కులో ఉన్న టేకు జాతికి చెందిన అక్రమ కలప గుర్తించామన్నారు. పట్టుకున్న కలప విలువ సోమవారం రూ.35 వేలు ఉంటుందని కలపతో సహా వాహనాన్ని కన్నాపురం కార్యాలయానికి తరలించి కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
భీమవరం: భీమవరం పట్టణంలోని రైల్వే ఫ్లైఓవర్ పైనుంచి పడి వృద్ధుడు మృతి చెందినట్లు భీమవరం వన్టౌన్ పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే... గురువారం రాత్రి ఫ్లైఓవర్ పైనుంచి గుర్తుతెలియని 65 ఏళ్ల వృద్ధుడు కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతుని వివరాలు తెలిసినవారు పోలీస్స్టేషన్లో సంప్రదించాలని కోరారు.


