వేండ్ర కాలువలో దిగి ఇద్దరు విద్యార్థుల దుర్మరణం
పాలకోడేరు: సెలవు రోజు కావడంతో సరదాగా కాలువలో ఈత కొట్టేందుకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు గల్లంతై మృతిచెందిన విషాద ఘటన పాలకోడేరు మండలం వేండ్రలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. భీమవరంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన నాలుగో సంవత్సరం విద్యార్థులు ఆరుగురు ఆదివారం మధ్యాహ్నం వేండ్రలోని జీఅండ్వీ మిగులు జలాల కాలువ వద్దకు వచ్చారు. వంతెన పై భాగంగా ఉన్న వైర్ ప్రాంతం వద్ద నుంచి భీమవరం గునుపూడిలోని బంట్రోతుల వీధికి చెందిన పెరుమాళ్ల సత్య భాస్కర విఘ్నేష్ (22), పార్వతీపురం మన్యం జిల్లా కొమర్యాడ మండలం ధనైపేట గ్రామానికి చెందిన శ్రీష్టు రాహుల్ (21), పల్నాడు జిల్లా గురజాలకు చెందిన ఎస్.సాయి స్నానం చేసేందుకు కాలువలో దూకారు. కాలువలో నీటి ప్రవాహానికి విఘ్నేష్, రాహుల్ గల్లంతుకాగా.. సాయిని మిగిలిన ముగ్గురు స్నేహితులు కర్రసాయంతో ఒడ్డుకు లాక్కొచ్చారు. విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చేపట్టగా విఘ్నేష్, రాహుల్ మృతదేహాలు లభించాయి. సాయిని చికిత్స నిమిత్తం భీమవరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విఘ్నేష్ మేనమామ మైలవరపు సీతారామమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
విద్యార్థుల మృతదేహాలు


