టి.నరసాపురం: టి.నరసాపురం మండలం అప్పలరాజుగూడెం ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్ (ఏపీఆర్ఎస్) ప్రతిష్టాత్మక ఉత్తమ పాఠశాల అవార్డును సొంతం చేసుకుంది. విజయవాడలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవాల్లో సీఎం చంద్రబాబు చేతులమీదుగా పాఠశాల హెచ్ఎం డాక్టర్ సీహెచ్ వెంకటేశ్వరరావు పురస్కారాన్ని అందుకున్నారు. పాఠశాలలో విద్యాభివృద్ధితో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, క్రీడలు, సృజనాత్మకతకు ప్రాధాన్యతనిస్తూ సాధించిన సమష్టి కృషికి ఈ పురస్కారం గుర్తింపుగా భావిస్తున్నట్టు హెచ్ఎం తెలిపారు.
ఉంగుటూరు: నారాయణపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల తీవ్ర సంక్షోభంలో ఉందని ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి ఉన్నత విద్యాశాఖ కమిషనర్ స్పందించారు. ప్రిన్సిపాల్ను సంజాయిషీ అడిగినట్టు తెలిసింది. ఈ మేరకు ప్రిన్సిపాల్ కె.వసుధ సంజాయిషీ ఇచ్చారు. గెస్ట్ ఫ్యాకల్టీని తీసుకున్నట్టు, పీఎం ఉషా బిల్డింగ్ను స్థానికుల సహకారం లేకపోవడంతో ప్రారంభించలేదని, మహిళను కావడంతోనే కమిటీ సభ్యులు తనను లక్ష్యంగా చేసుకున్నట్టు ఆరోపణలు చేస్తూ సమాధానమిచ్చినట్టు సమాచారం.


