తాడేపల్లిగూడెం: తమ పూర్వీకుల భూమిని కొందరు ఆక్రమించుకుని అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని, దీనిపై తాము హైకోర్టులో పోరాడుతున్నామని దామోజీపురపు వంశీకులు తెలిపారు. ఈ క్రమంలో ఆక్రమణదారుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దామోజీపురపు ముఖ్యప్రాణారావు మనుమడు, ఇతర వారసులు మాట్లాడారు. తమ ముత్తాతలు 1916లో రైస్ మిల్లు నిర్వహణ కోసం 5.08 సెంట్ల భూమిని ఇద్దరు వ్యక్తులకు లీజుకిచ్చారని తెలిపారు. కాలక్రమంలో ఆ లీజు ఇతరుల చేతులు మారిందని, అయితే కొందరు బినామీలు కొన్ని సంవత్సరాలుగా లీజు సొమ్ము చెల్లించకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తమ కుటుంబానికి సన్నిహితుడైన మైలవరపు పెదబాబుకు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చామన్నారు. అయినప్పటికీ ఆ ఆస్తి తనదేనంటూ పవన్ కుమార్ గుప్తా అనే వ్యక్తి 23 అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారని మండిపడ్డారు. దీనిపై తాము హైకోర్టును ఆశ్రయించగా కోర్టు స్టే విధించిందని తెలిపారు. అయితే ఆక్రమణదారులతో అధికారులు చేతులు కలిపి ఆ స్టేను రద్దు చేయించారని ఆరోపించారు. భూమిని కాపాడుకునే క్రమంలో పట్టణానికి చెందిన కొందరి నుంచి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.


