నరసాపురం రూరల్ : లారీ ఢీకొన్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ నవ వరుడు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన మొగల్తూరు మండలం ముత్యాలపల్లిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వారతిప్ప గ్రామానికి చెందిన స్థానిక నాయకుడు దొంగ శ్రీను కుమారుడు దొంగ విఘ్నేష్ (28) గురువారం రాత్రి ద్విచక్రవాహనంపై ముత్యాలపల్లి వద్ద జాతీయ రహదారిపై వెళ్తుండగా తమిళనాడుకు చెందిన లారీ ఢీకొట్టింది. లారీ చక్రాలు అతని పైనుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే అతడిని నరసాపురంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మృతునికి రెండు నెలల క్రితమే వివాహమైందని బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమాదానికి కారణమైన లారీని స్వాధీనం చేసుకుని, డ్రైవర్, క్లీనర్లను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై వాసు తెలిపారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


