తాడేపల్లిగూడెం: జనసేన సానుభూతిపరులైన ముగ్గురు వ్యక్తుల నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని రిషిరాజ్, పదంకుమార్ గుప్తా ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ, 120 ఏళ్లుగా తమ ఆధీనంలో ఉన్న ఆస్తులపై హైకోర్టు స్టే ఉన్నప్పటికీ మారం వెంకటేశ్వరరావు, మైలవరపు పెదబాబు, పైబోయిన కిరణ్కుమార్ అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, జిల్లా రిజిస్ట్రార్ సంయుక్తంగా ఆ అక్రమ రిజిస్ట్రేషన్ను రద్దు చేశారని రిషిరాజ్ వెల్లడించారు. రిజిస్ట్రేషన్ రద్దు చేయించడంతో సదరు వ్యక్తులు రౌడీలను తీసుకొచ్చి బెదిరిస్తున్నారని, చంపేస్తామని హెచ్చరిస్తున్నారని వాపోయారు. ఈ ఆస్తుల వ్యవహారానికి సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ బోణం ఆదిప్రసాద్ తెలిపారు. గతంలో కొందరు తమ ఆస్తుల్లోకి అక్రమంగా ప్రవేశించారని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామన్నారు. తమకు వన్ప్లస్ ఫోర్ ఆర్మ్డ్ ఫోర్సు కావాలని వారు కోరారని, అయితే అది ఏర్పాటు చేయడం తమ పరిధిలోని అంశం కాదని స్పష్టం చేశారు.


