చింతలపూడి (జంగారెడ్డిగూడెం) : జంగారెడ్డిగూడెం గ్రీన్ఫీల్డ్ హైవే సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాద బాధితులను వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకుడు జెట్టి గురునాథరావు పరామర్శించారు. స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి, వారికి అందుతున్న వైద్య సేవల గురించి వైద్యులను, బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రహదారి ప్రమాదాలు జరిగిన సమయంలో బాధితులకు త్వరితగతిన ఆర్థోపెడిక్ (ఎముకల సంబంధిత) వైద్యం అందడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న ఆర్థోపెడిక్ వైద్య నిపుణుడిని నియమించాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాద బాధితులకు మెరుగైన, నాణ్యమైన వైద్యం ఉచితంగా అందేలా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆయన వెంట వైఎస్సార్సీపీ జంగారెడ్డిగూడెం పట్టణ, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


