నూజివీడు: ప్రియురాలిని ప్రేమ వివాహం చేసుకుని తన ఇంటికి తీసుకెళ్లిన యువకుడిపై యువతి తల్లిదండ్రులు రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గొల్లపల్లికి చెందిన యువతి కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలోని తన మేనమామ ఇంటి దగ్గర ఉంటూ చదువుకుంటోంది. ఈ క్రమంలో గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ, మూడు రోజుల క్రితం వివాహం చేసుకుని బాపులపాడు మండలం వీరవల్లి పోలీసులను ఆశ్రయించారు. వారిద్దరూ మేజర్లు కావడంతో పోలీసులు ఇరువర్గాలకు కౌన్సెలింగ్ నిర్వహించి, యువతిని భర్త ఇంటికి పంపించారు. అయితే, తమ అమ్మాయిని తమ దగ్గరకు పంపించాలంటే ఆమె భర్త రూ.12 లక్షలు డిమాండ్ చేస్తున్నాడంటూ సోమవారం నూజివీడు రూరల్ పోలీస్స్టేషన్లో యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భీమవరం: సర్వోదయ మండలి ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్థాయిలో ‘భారత స్వాతంత్య్ర ఉద్యమం – అమరవీరుల త్యాగఫలాలు‘ అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో 20 రచనలను ఉత్తమమైనవిగా ఎంపిక చేసినట్లు సర్వోదయ మండలి జిల్లా కార్యదర్శి ఇందుకూరి ప్రసాదరాజు తెలిపారు. పాఠశాల స్థాయిలో పి.సుహాసిని శ్రీదుర్గ (దర్శిపర్రు), ఎండీ యాస్మిన్ జారా (ఏలూరు), పి.వర్షిణి (జీలకర్రగూడెం), కె.కుషాలి (బొర్రంపాలెం), టి.కుసుమ (కళ్లచెరువు), సీహెచ్ భాను (సీతంపేట), ఏవీ స్వాగత్ (భీమవరం), ఎస్సీహెచ్.సత్యబ్రాహ్మణి (కొయ్యలగూడెం), సి.సాహితి (అత్తిలి), కె.క్రాంతి (పెదనిండ్రకొలను), కె.వర్ష (పాలకోడేరు), సీహెచ్.నాగవర్షిణి (రాయకుదురు), కె.వైష్ణవి (అనాకోడేరు), డి.గీతాంజలి (పాలకొల్లు), కేడీ కార్తీక్ (పత్తేపురం), ఓ.బిందు (ఈస్ట్ విప్పర్రు), కె.నిత్యత (నాగులగూడెం) ఎంపికయ్యారు. అలాగే, కళాశాలల స్థాయిలో కె.ప్రియాంక (జంగారెడ్డిగూడెం), ఎ.వర్షిత్ (పెన్నాడ), జె.ప్రణవి (వీరవాసరం) ఎంపికయ్యారని, విజేతలకు ఈ నెల 13, 14 తేదీల్లో భీమవరం, ఏలూరులలో బహుమతులు అందజేస్తామని ప్రసాదరాజు చెప్పారు.
తణుకు అర్బన్: అమరావతి చాంపియన్షిప్ జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు తణుకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించారు. నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ కేవీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలను మునిసిపల్ మాజీ చైర్మన్ పరిమి వెంకన్నబాబు ప్రారంభించారు. అథ్లెటిక్స్లో 100, 200, 400 మీటర్ల రన్నింగ్ పోటీలు, జావలిన్త్రో, హైజంప్, షాట్పుట్ విభాగాల్లో జిల్లా నలుమూలల నుంచి 140 మంది క్రీడాకారులు పోటీలో పాల్గొనగా 24 మంది క్రీడాకారులు మొదటి స్థానంలో నిలిచి విజయవాడలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరావు, డీవైఈవో డి.మురళిసత్యనారాయణ, ఏంపీడీవో కార్యాలయ ఏవో వి.కృష్ణచంద్రరావు, క్రీడల కోఆర్డినేటర్ సంకు సూర్యనారాయణ, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


