పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో పది రోజులుగా నిర్వహించిన వరుణ జపం పూజల్లో భాగంగా సోమవారం స్వామికి జలాభిషేకం చేశారు. ఉదయం గణపతి పూజ, 108 కలశాలతో అభిషేకం, రుద్ర పారాయణ, దేవతారాధన వంటి వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కెనాల్ రోడ్డులో ఉన్న శ్రీకృష్ణ ఆలయం వద్దకు వెళ్లి కలశాలతో కాలువ నీళ్లు తీసుకుని వచ్చి స్వామికి జలాభిషేకం చేశారు. ఈ అభిషేకంలో పండిట్ భమిడిపాటి వెంకన్న, మద్దూరు సూరిబాబుల బ్రహ్మత్వంలో ఆలయ ప్రధానార్చకులు కిష్టప్ప, అనిల్, వీరబాబు, 25 మంది రుత్వికులు పాల్గొన్నారు. ఆలయ ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు, సూపరింటెండెంట్ పి.వాసు, ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. గత పది రోజులుగా జరిగిన వరుణ జపం, జలాభిషేకం పూజలపై పట్టణంలో ఎక్కడా ప్రచారం చేయకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో మైక్ ద్వారా ప్రచారం చేసి ఉంటే భక్తులందరికీ తెలిసేదని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనేవారని చెబుతున్నారు.
క్షీరారామలింగేశ్వరస్వామికి జలాభిషేకం చేస్తున్న దృశ్యం.. కలశాలతో నీళ్లు తీసుకొస్తున్న అర్చక స్వాములు


