పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో 10 రోజులు విశేష పూజలు జరుగుతున్నాయి. సోమవారం లోక కల్యాణార్థం ఉదయం 7.15 గంటలకు (ఆరుద్ర నక్షత్రం) జలాభిషేకం నిర్వహించనున్నారు. ఆదివారం ఆలయ అ భిషేక పండిట్ భమిడపాటి వెంకన్న, మద్దూరి సూరిబాబు, సుబ్బయ్యల బ్రహ్మత్వంలో 108 కలశాలతో మహాన్యాసం, రుద్రాభిషేకం, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈఓ ముచ్చర్ల శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావ (రాము), ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం రూరల్: ఆరుగొలను డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో 5, 6వ తరగతి, జూనియర్ ఇంటర్లో ఖాళీల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్ ఎం.దుర్గారావు ప్రకటనలో తెలిపారు. 5వ తరగతిలో 10 సీట్లు, 6వ తరగతిలో ఒక సీటు, జూనియర్ ఇంటర్ (10వ తరగతిలో 400లకు పైగా మార్కులు వచ్చిన వారు) ఎంపీసీ గ్రూపులో ఎనిమిది సీట్లు ఖాళీ ఉన్నాయన్నారు. ఆసక్తి గల వారు ఎస్సీ విద్యార్థులు ఈ నెల 10న గురుకులంలో సంప్రదించాలని కోరారు.
కలిదిండి(కై కలూరు) : ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం కలిదిండిలో పర్యటించనున్నారు. మంత్రి కొలుసు పార్థసారథి, కై కలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) పర్యటన వివరాలు వెల్లడించారు. మీ భూమి–మీ హక్కు పట్టాల పంపిణీలో భాగంగా ఇక్కడకు రానున్నారని, ఉదయం 10.45 గంటలకు ఇక్కడకు చేరుకుంటారన్నారు. హెలీప్యాడ్, సభ, సమావేశ స్థలాలను ఆదివారం పరిశీలించారు. కలెక్టర్ కె.వెట్రిసెల్వీ, ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్, జేసీ, ఆర్డీవో, సబ్ కలెక్టర్లు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.


