దెందులూరు : మండలంలోని కొవ్వలి గ్రామంలో నీళ్ల తొట్టెలో పడి సూరిలేటి రామారావు (65) అనే వృద్ధుడు మృతి చెందినట్లు ఎస్సై డి. వెంకట్కుమార్ తెలిపారు. ఈ నెల 7న రాత్రి బాత్రూమ్కు వెళ్లిన రామారావు ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూశారు. బాత్రూమ్ ఎదురుగా ఉన్న నీళ్ల తొట్టెలో పడి ఉన్న అతడిని వెంటనే బయటకు తీసినప్పటికీ అప్పటికే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏలూరు టౌన్: నగర శివారులోని ఆటోనగర్ మురుగు కాలువ సమీపంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో ఏలూరు రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుని వయస్సు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు జీజీహెచ్ మార్చురీకి తరలించారు. మృతుని వివరాలు తెలిసిన వారు ఏలూరు రూరల్ పోలీసులను సంప్రదించాలని కోరారు.
వేలేరుపాడు : మండలంలోని శివకాశీపురం గిరిజన ప్రాథమికోన్నత బాలికల ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం విద్యుత్ షాక్తో విద్యార్థిని కెచ్చెల లక్ష్మీపార్వతి (13) మృతి చెందిన ఘటనపై అధికారులు చర్యలు చేపట్టారు. కేఆర్పురం ఐటీడీఏ విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ జగన్నాథరావు వార్డెన్ పండు ఇందు, హెచ్ఎం బి.గంగారత్నాన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బాలికల పాఠశాలలో పనిచేస్తున్న పురుష ఉపాధ్యాయుడిని విజయవాడలోని ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ కార్యాలయానికి బదిలీ చేశారు. ఆశ్రమ పాఠశాలలో అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్ వైరింగ్ను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డీడీ తెలిపారు.


