యలమంచిలి: శ్రీకృష్ణదేవరాయల 518వ పట్టాభిషేకం, దివిసీమ గాంధీ మండలి వెంకట కృష్ణారావు శతజయంతి స్మారక వేడుకలు ఒకే వేదికపై నిర్వహించడం సంతోషదాయకమని ఏపీ నాటక పరిషత్ల సమాఖ్య అధ్యక్షుడు బుద్ధాల వెంకట రామారావు అన్నారు. పాలకొల్లులోని లయన్స్ కమ్యూనిటీ హాల్లో శ్రీకృష్ణదేవరాయ సాంస్కృతిక విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో శనివారం సాహితీ సభ, ప్రతిభా సత్కార కార్యక్రమం జరిగాయి. ఈ సందర్భంగా సమాజానికి విశిష్ట సేవలందించిన పలువురు ప్రముఖులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో విద్యార్థినుల భువనవిజయం సాహితీ రూపకం, చైతన్య ప్రసాద్ అభ్యుదయ గీతాలు, కూచిపూడి నృత్య ప్రదర్శనలు అలరించాయి. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు యర్రంశెట్టి వెంకటరత్నం అధ్యక్షతన జరిగిన ఈ సభలో పెనుమాక రామమోహనరావు, గుండా రామకృష్ణ, కడిమిళ్ల వరప్రసాద్ శతావధాని, సివివి సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
భీమవరం: భీమవరం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లవానితిప్ప రోడ్డులో ఉన్న పంటకాలువ రేవులో శనివారం సుమారు 75 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. వీఆర్వో అమిరపు నాగవరప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రహ్మాన్ తెలిపారు.
ఉండి: ఎదురుగా వస్తున్న లారీకి దారిచ్చే క్రమంలో ఓ ట్రాక్టర్ పంట కాలువలోకి బోల్తా పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కాళ్ల మండలం సీసలిలో ఇటుకలు దిగుమతి చేసుకుని అత్తిలి వైపు వెళ్తున్న ట్రాక్టర్, పెదపుల్లేరులోని ఆర్అండ్బీ రోడ్డుపై ఎదురుగా వస్తున్న లారీకి దారి ఇచ్చేందుకు ట్రాక్టర్ డ్రైవర్ వాహనాన్ని పక్కకు తీశాడు. అక్కడ రోడ్డు మార్జిన్ లేకపోవడంతో నియంత్రణ కోల్పోయి పంట కాలువలోకి బోల్తా కొట్టింది. ఈ ప్రమాద సమయంలో ట్రాక్టర్లో ఐదుగురు ప్రయాణిస్తుండగా, వారందరికీ స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదు.


