ఏలూరు (ఆర్ఆర్పేట): ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని, న్యాయవాదుల భద్రత కోసం ప్రత్యేకంగా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు బీవీ కృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు సీహెచ్ రాజేంద్రప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీవీ రామాంజనేయులు డిమాండ్ చేశారు. శనివారం ఏలూరులోని రాజేంద్రప్రసాద్ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నియోజకవర్గాల అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వైఎస్సార్ లా నేస్తం ద్వారా జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5 వేల చొప్పున మూడేళ్లపాటు స్టైఫండ్ అందించారని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ మొత్తం రూ.10 వేలకు పెంచి ఇస్తామని హామీ ఇచ్చి నేటికీ అమలు చేయకపోవడం విచారకరమన్నారు. వృత్తిపరమైన దాడులు, బెదిరింపుల నుంచి రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. అనంతరం జిల్లాలో లీగల్ సెల్ బలోపేతంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో బీవీ కృష్ణారెడ్డి, సీహెచ్ రాజేంద్రప్రసాద్లను నాయకులు శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నియోజకవర్గాల అధ్యక్షుడు ప్రత్తిపాటి తంబి (ఏలూరు), జేడీ గాంధీ (నూజివీడు), అడ్డగర్ల రాంబాబు (కై కలూరు), యర్రా సురేష్ (దెందులూరు) తదితరులు పాల్గొన్నారు.


