బుట్టాయగూడెం : రోడ్డు విస్తరణ పనుల్లో ఇల్లు తొలగింపునకు గురవుతుందన్న మనస్తాపంతో జీలుగుమిల్లి మండలం కనకాపురంనకు చెందిన వి.శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాల ప్రకారం జాతీయ రహదారి భూసేకరణలో భాగంగా శ్రీనివాస్ ఇల్లు కూల్చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన శ్రీనివాస్ రెవెన్యూ అధికారుల సమక్షంలోనే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన కొందరు వ్యక్తులు వెంటనే స్పందించి అతని చేతిలోని పెట్రోల్ బాటిల్ను లాక్కున్నారు. రోడ్డు వెడల్పు పనుల్లో మొదట తన నివాసాన్ని తొలగించమని అధికారులు చెప్పారని, కానీ ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయాలని అధికారులు చెప్పడంతో ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు శ్రీనివాస్ తెలిపాడు. ప్రభుత్వ అధికారులు స్పందించి తమ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు.


