కావడి సేవ ఒక భక్తి మార్గం
ముదినేపల్లి (కై కలూరు): ఆడి కృత్తిక కావడి సేవా మహోత్సవానికి శింగరాయపాలెం – చేవూరుపాలెం సెంటర్లో కొలువైన వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానం సిద్ధమయ్యింది. తమిళనాడు రాష్ట్రం పళినిలో జరిగే కావడి సేవను రెండో ఏడాది శింగరాయపాలెంలో నిర్వహిస్తున్నారు. గతేడాది భక్తుల నుంచి వచ్చిన స్పందన చూసి ఈ ఏడాది కావడి ఉత్సవానికి మరిన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం కావడి సేవతో పాటు గ్రామోత్సవం, శాంతికల్యాణం నిర్వహించనున్నారు. కావడి ఉత్సవానికి 500 మంది భక్తులు పాల్గొంటారని కావడిలను దేవస్థానం సిద్ధం చేసింది. బుధవారం నాటికి 300 మంది పైబడి భక్తులు పేర్లు నమోదు చేసుకోవడం విశేషం. ఈ వేడుకకు పురాణ ప్రాశస్త్యం ఉంది. భక్తులు తమ భుజాలపై కావడి మోస్తూ మురుగన్ను దర్శించుకోవడం ఆనవాయితీగా మారింది. ఇదే పద్ధతిని సింగరాయపాలెం దేవస్థానంలో గతేడాది నుంచి అమలు చేస్తున్నారు.
కార్యక్రమాలు ఇలా..
ఈనెల 7వ తేదీ విఘ్నేశ్వర, గో పూజా, పుణ్యాహవచన, పంచగవ్య ప్రాసన, సర్వసూక్త పారాయణ, గ్రామోత్సవం, అభిషేకాలు, శాంతి కల్యాణం నిర్వహిస్తున్నారు. కావడి సేవలో పాల్గొనే భక్తులు రూ.558 చెల్లిస్తే దేవస్థానం కావడి అందిస్తుంది. కావడి ఉత్సవంలో పాల్గొనే భక్తులు పుసుపు వస్త్రాలు మాత్రమే ధరించాలని దేవస్థాన సిబ్బంది చెప్పారు. అదే రోజు 3 వేల మంది భక్తులకు అన్నసమారాధన ఏర్పాటు చేశారు. ఒక్క కావడి ఉత్సవానికి దాదాపు 1,500 మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఆలయ చైర్మన్ బొంగు రవికుమార్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ఆడికృత్తిక నక్షత్రం రోజున వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి కావడి సేవ చేయడంతో ఇష్టకామ్య సిద్ధి లభిస్తుంది. దేవస్థానం తరుఫున 500 కావడిలు సిద్ధం చేశాం. పాలు, నెయ్యి, పుష్పాలు, చందన, పండ్లు, పంచామృత, బెల్లం ఇలా వివిధ రూపాల్లో స్వామికి కావడిని సమర్పించవచ్చు. భక్తులకు అన్నసమారాధన ఏర్పాటు చేస్తున్నాం. భక్తులు పెద్ద ఎత్తున హాజరవ్వండి.
– ఆర్.గంగాశ్రీదేవి, సహాయ కమిషనర్, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానం, శింగరాయపాలెం
రేపు శింగరాయపాలెం ఆలయంలో ఉత్సవం
తమిళనాడు పళని తరహాలో ఆడి కృత్తిక కావడి సేవ
ఏర్పాట్లు చేస్తున్న దేవదాయ శాఖ


